Begin typing your search above and press return to search.

మరోసారి జతకట్టనున్న ఇద్దరు నేచురల్ స్టార్స్!

By:  Tupaki Desk   |   27 May 2020 11:30 PM GMT
మరోసారి జతకట్టనున్న ఇద్దరు నేచురల్ స్టార్స్!
X
నేచురల్ స్టార్ నాని, నేచురల్ హీరోయిన్ సాయిపల్లవి మూడేళ్ల కిందట `ఎమ్‌సీఏ` సినిమాలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సందడి ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తమ సహజ నటనతో ఈ జంట తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. త్వరలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించబోతున్నారట. 'ఎంసిఏ' సినిమాలో కలసి నటించిన నాని, సాయిపల్లవి జంట మరోసారి త్వరలో రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించనున్నారట. రాహుల్ దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయనున్నాడు. దీనికి 'శ్యాం సింగ రాయ్' అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ సాయిపల్లవితో సంప్రదింపులు జరుపుతోందట.

ఇక ఆ పాత్ర కూడా సాయిపల్లవికి బాగా నచ్చిందనీ సమాచారం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కథానాయిక పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందనీ, అందుకే ఆమె ఒప్పుకుందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా నాటి పిరియాడిక్ కంటెంట్ తో సాగుతుందనీ, ఒకప్పటి కలకత్తా నగరాన్ని తలపించే నేపథ్యం అవసరమనీ అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లి షూటింగ్ చేయడం వీలుపడదు. కాబట్టి ఆ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ హైదరాబాదులో భారీ సెట్స్ వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కలకత్తా సెట్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ వుంటుంది. ఇక ఇది నాని నటించే 27 వ చిత్రం అవుతుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమా చేస్తున్నాడు.