Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే శ్రియా పాన్ ఇండియా 'గమనం'

By:  Tupaki Desk   |   3 Sep 2021 2:30 AM GMT
థియేటర్లలోనే శ్రియా పాన్ ఇండియా గమనం
X
శ్రియా శ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ''గ‌మ‌నం''. ఇందులో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ - శివ కందుకూరి - నిత్యా మీనన్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. సుజ‌‌నా రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం ''గ‌మ‌నం'' ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు వెల్లడించారు. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి శ్రియతో పాటు శివ కందుకూరి - ప్రియాంక జ‌వాల్క‌ర్ - మాటల రచయిత బుర్రా సాయిమాదవ్ - దర్శక నిర్మాతలు హాజరయ్యారు. రియ‌ల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

'గమనం' చిత్రంలో వినికిడి లోపం ఉన్న సాధారణ మహిళగా కనిపించనుంది. ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలని కలలు కనే యువకుడిగా శివ కందుకూరి.. అతని ప్రేయసిగా ప్రియాంక జ‌వాల్క‌ర్.. శాస్త్రీయ సంగీత గాయనిగా నిత్యా మీనన్ నటించారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జ్ఞాన శేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందించారు. క్రియా ఫిలిం కార్పొరేషన్ - కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సినిమాటోగ్రాఫ‌ర్‌ జ్ఞాన‌శేఖ‌ర్ - ర‌మేష్ క‌రుటూరి - వెంకీ పుష‌డ‌పు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.