Begin typing your search above and press return to search.

కథ వినగానే కన్నీళ్లు ఆగలేదు: శ్రియ

By:  Tupaki Desk   |   8 Dec 2021 4:30 AM GMT
కథ వినగానే కన్నీళ్లు ఆగలేదు: శ్రియ
X
సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరోలు ఎక్కువ కాలం నిలబడతారు. కానీ హీరోయిన్లకు ఆ అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ల కెరియర్ అంతా కూడా గ్లామర్ పైనే ఆధారపడి ఉంటుంది. నటన పరంగా ఎన్ని మంచి మార్కులు దక్కినా, అందం అనేది తగ్గకుండా చూసుకుంటూ ఉండవలసిందే. అలా గ్లామర్ విషయంలో శ్రద్ధ పెట్టినవారే ఇక్కడ ఎక్కువకాలం పాటు కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటారు. ఇండస్ట్రీనే ఇల్లుగా చేసుకుని ఉండిపోతారు. అలాంటి అతికొద్ది మంది కథానాయికలలో శ్రియ ఒకరు.

కొత్త కథానాయికల నుంచి ఎదురవుతున్న పోటీని ఎప్పటికప్పుడు తట్టుకుంటూనే ఆమె తన కెరియర్ ను నెట్టుకొచ్చింది. సీనియర్ స్టార్ హీరోల సరసన నాయికగా అవకాశాలను అందుకుంటూ వెళ్లింది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకి తల్లి అయినప్పటికీ, నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవల ఆమె చేసిన 'గమనం' సినిమా విడుదలకి సిద్ధమైంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ సినిమాను గురించి మాట్లాడింది.

కొంతకాలం క్రితం సుజనారావు గారు నన్ను కలిసి ఈ కథ వినిపించారు. కథ వినగానే నాకు కన్నీళ్లు ఆగలేదు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆమె ఈ కథను అల్లుకున్నట్టుగా చెప్పారు. ముఖ్యంగా నేను పోషించిన పాత్రను ఆమె ప్రత్యక్షంగా చూశానని అన్నారు. అప్పుడు మాత్రం నేను కదిలిపోయాను. నిజంగానే ఈ కథ నన్ను కదిలించింది. అందువల్లనే నేను చేస్తానని చెప్పేశాను. ఈ పాత్రను చేస్తున్నప్పుడు కూడా నేను ఉద్వేగానికి లోనైన సందర్భాలు ఉన్నాయి. కొన్ని కథలు జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. కానీ ఈ కథలు జీవితాల్లో నుంచి పుడతాయి .. అలాంటి కథనే ఇది.

అందువల్లనే ఇది ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. లేడీ డైరెక్టర్ సుజనారావుగారు ప్రతి సన్నివేశాన్ని సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లారు. లేడీ డైరెక్టర్స్ తో నేను ఇంతకు ముందు ఇతర భాషలలో చేశానుగానీ, తెలుగులో చేయడం మాత్రం ఇదే ఫస్టు టైమ్. ఈ సినిమాలో నేను దివ్యాంగురాలైన 'కమల' పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాత్ర కోసం నేను కుట్టుపని నేర్చుకున్నాను. ఈ సినిమాలో మూడు కథలు ఒకే సమయంలో నడుస్తుంటాయి. వాళ్లందరిలోను ఎన్నో కలలు .. మరెన్నో ఆశలు ఉంటాయి. అలాంటి వాళ్లంతా ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. ఆ విపత్తు నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే కథ" అంటూ చెప్పుకొచ్చారు.