Begin typing your search above and press return to search.

బర్త్ డే నాడు ఆర్జీవీ కి షాక్.. డేంజరస్ 'మా ఇష్టం' రిలీజ్ కు బ్రేక్..!

By:  Tupaki Desk   |   7 April 2022 10:23 AM GMT
బర్త్ డే నాడు ఆర్జీవీ కి షాక్.. డేంజరస్ మా ఇష్టం రిలీజ్ కు బ్రేక్..!
X
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లెస్బియన్ క్రైమ్ థ్రిల్లర్ ''డేంజరస్''. నైనా గంగూలీ - అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'మా ఇష్టం' పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రేపు ఏప్రిల్ 8న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఆర్జీవీ రూపొందించిన 'మా ఇష్టం' ( డేంజరస్) సినిమా విడుదలపై కోర్ట్ స్టే ఇచ్చింది.

ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసి 'డేంజరస్' చిత్రం విడుదలను నిలుపుదల చేయిస్తూ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని వచ్చారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని.. డబ్బులు ఇవ్వకుండా ఆర్జీవీ తప్పించుకుంటున్నాడని నట్టి కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను రాంగోపాల్ వర్మ తుంగలో తొక్కినట్టు నట్టి కుమార్ ఆరోపించారు. ఈ మేరకు కోర్టు వాదప్రతివాదనలు విన్న తర్వాత ఆర్జీవీ తీసిన 'మా ఇష్టం' (డేంజరస్) సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ చిత్రాన్ని ప్రదర్శించినా ప్రదర్శనకు సహకరించినా కాంటెంప్ట్ అఫ్ కోర్ట్ అవుతుందని సూచించింది.

'డేంజరస్' సినిమా కోసం ఎన్నడూ లేని విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఆర్జీవీ. మరికొన్ని అంతా ఓకే అనుకోని మరికొన్ని గంటల్లో సినిమా విడుదల అవుతుందని అనుకుంటున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఇక చేసేదేమీ లేక సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే వర్మ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ గురించి చెప్పకుండా.. స్వ‌లింగ సంప‌ర్కం నేప‌థ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో థియేటర్స్ సహకరించకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. త్వ‌ర‌లోనే డేంజరస్ చిత్రాన్ని విడుద‌ల చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

"లెస్బియన్ నేపథ్యం సబ్జెక్ట్ కారణంగా 'మా ఇష్టం' DANGEROUS సినిమా విడుదల విషయంలో చాలా థియేటర్స్ సహకరించకపోవడంతో సినిమా విడుదల పోస్ట్ పోన్ చేస్తున్నామని తెలియజేయడానికి చింతిస్తున్నాను. అన్ని విధాలుగా ఈ అన్యాయాన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలించి తగు చర్యలు తీసుకున్న తరువాత మరో విడుదల తేదీ తెలియచేస్తాను" అని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నారు.

నిజానికి పీవీఆర్ సినిమాస్‌ మరియు ఐనాక్స్ సినిమాస్ వంటి మల్టీఫ్లెక్స్ లు 'డేంజరస్' సినిమాని ప్రదర్శించడానికి తిరస్కరించాయి. ఈ క్రమంలో ఇప్పుడు నట్టి కుమార్ కోర్టుకు వెళ్లి సినిమా విడుదలను అడ్డుకున్నారు. వర్మకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.