Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాలో బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి...?

By:  Tupaki Desk   |   9 Jun 2020 3:35 PM GMT
నితిన్ సినిమాలో బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి...?
X
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ 'భీష్మ' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా సినిమాలు లైన్లో పెడుతూ దూకుడు చూపిస్తున్నాడు నితిన్. ఈ క్రమంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే' సినిమా చేస్తున్నాడు నితిన్. 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. నితిన్ - కీర్తి సురేష్‌ లు తొలిసారి కలిసి నటిస్తుండటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించడం విశేషం. 'రంగ్ దే' సినిమా తర్వాత బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధాదున్' మూవీని నితిన్ తెలుగులో రిమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. హిందీ 'అంధాదున్' సినిమాకి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఆయుష్మాన్ ఖురానా - రాధికా ఆప్టే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ టబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. కాగా నితిన్ 'రంగ్ దే' సినిమా కంప్లీట్ అయిన వెంటనే 'అంధాదున్' తెలుగు రీమేక్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి మరియు ఠాగూర్ మధు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్న మేర్లపాక గాంధీ హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నారట.

కాగా తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ప్రియాంక మోహన్ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారట. 'గ్యాంగ్ లీడర్' సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయిన ప్రియాంక మోహన్ ప్రస్తుతం శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా హిందీ 'అంధాదున్' విజయంలో కీ రోల్ ప్లే చేసిన టబు క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలి అన్న విషయంలో కూడా చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోందట. ఇంతకముందు ఈ పాత్ర కోసం టబు, రమ్యకృష్ణ, అనసూయ ల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ పాత్ర కోసం బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టిని సంప్రదిస్తున్నారట. ఇప్పటికే ఆమె నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ సరసన 'సాహస వీరుడు సాగర కన్య'.. మోహన్ బాబుతో కలిసి 'వీడెవడండీ బాబూ'.. కింగ్ నాగార్జునతో కలిసి 'ఆజాద్'.. బాలకృష్ణ సరసన 'భలే వాడివి బాసూ' చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది శిల్పాశెట్టి. మరి నితిన్ సినిమాలో ఆమె నటిస్తుందన్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.