Begin typing your search above and press return to search.

సరిగ్గా రెండేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   11 Nov 2020 8:50 AM GMT
సరిగ్గా రెండేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా ముందుకు సూపర్‌ స్టార్‌
X
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ వరుసగా ప్లాప్‌ లు చవి చూశాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. షారుఖ్‌ చివరగా 2018 డిసెంబర్‌ 21న క్రిస్మస్‌ కానుకగా తన 'జీరో' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకున్నాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. ఆ సినిమా లో షారుఖ్‌ మరగుజ్జుగా కనిపించాడు. అందుకోసం చాలా కష్టపడ్డాడు. తానే భారీ బడ్జెట్‌ తో ఆ సినిమాను నిర్మించాడు. నిర్మాతగా భారీగా నష్టపోవడంతో పాటు హీరోగా కూడా టైటిల్‌ కు తగ్గట్లు జీరో అనిపించుకున్నాడు. ఇరువై సంవత్సరాలు బాలీవుడ్‌ లో నెం.1 హీరోగా కొనసాగిన షారుఖ్‌ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు అంటూ అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అభిమానులను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నిరాశ పర్చవద్దనే ఉద్దేశ్యంతో మంచి కథ కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేశాడు. ఎట్టకేలకు యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ లో సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో పఠాన్‌ అనే సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమా అధికారికంగా ఓకే అయ్యి కూడా చాలా నెలలు అవుతుంది. కాని కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. దీపిక పదుకునే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్‌ అబ్రహం కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ 15 నిమిషాల ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట.

ఈ సినిమాను డిసెంబర్‌ లో పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జీరో సినిమా విడుదలైన సరిగ్గా రెండు సంవత్సరాలకు సల్మాన్‌ సినిమా మొదలు కాబోతుంది. వచ్చే ఏడాదిలో అంటే జీరో సినిమా విడుదలైన మూడు సంవత్సరాలకు పఠాన్‌ మూవీ విడుదలకు రెడీ అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్‌ మీడియా సర్కిల్స్ లో టాక్‌ వినిపిస్తుంది.