Begin typing your search above and press return to search.

సర్కారు వారి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ..!

By:  Tupaki Desk   |   28 April 2022 6:38 AM GMT
సర్కారు వారి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న నీ సినిమాని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా 'సర్కారు వారి పాట' ప్రచార కార్యక్రమాలు శరవేగంగా జరగడం లేదని కొద్దిరోజుల క్రితం వరకు మహేష్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పుడు మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ ప్లాన్ చేయడంతో ఖుషీ అవుతున్నారు.

ఇటీవలే సర్కారు వారి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసిన టీమ్.. సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఏఎస్ ప్రకాష్ తో కలిసి ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. గత రెండు రోజులుగా ఆయన వరుసగా ఎలక్ట్రానిక్ - ప్రింట్ మీడియా మరియు వెబ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా సంగతులను చెబుతూ వస్తున్నారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్స్ లో ప్రధాన తారాగణం లేదా డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ వంటి కీలకమైన సాంకేతిక నిపుణులు కనిపిస్తుంటారు. కానీ SVP ప్రచార కార్యక్రమాలు చాలా మందికి తెలియని ఏఎస్ ప్రకాష్ తో ప్రారంభించారు.

సినిమా కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఇవ్వాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన అని తెలుస్తోంది. ఏఎస్ ప్రకాష్ కు 'సర్కారు వారి పాట' 7వ సినిమా. ఇందులో సెట్స్ కు చాలా ప్రాధాన్యం ఉంది. దాదాపు 80 శాతం షూటింగ్ సెట్స్ లోనే జరిగిందని ఆర్ట్ డైరెక్టర్ చెబుతున్నారు.

సినిమాలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కు అంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి.. వారిని ఎక్స్ పోజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఎస్ ప్రకాష్ ఇంటర్వ్యూతో నిన్న సర్కారు వారి పాట హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇదొక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని.. ఇందులో మహేష్ డ్యాన్స్ విశ్వరూపం చూపించారు అంటూ ఆర్ట్ డైరెక్టర్ సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ రెండు వారాల్లో SVP ని వార్తల్లో నిలపాలని కోరుకుంటున్న మేకర్స్.. రాబోయే రోజుల్లో ఇతర కీలకమైన టెక్నీషియన్లతో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా సర్కారు వారి హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ప్రింట్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలిపింది.

ఫ్యామిలీతో కలిసి హాలిడేకి వెళ్లిన మహేష్.. తిరిగి వచ్చిన వెంటనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఆ లోపు మిగతా నటీనటులు - టెక్నిషియన్స్ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు. మరోవైపు 'సర్కారు వారి పాట' ట్రైలర్ మరియు సినిమాలోని మాస్ సాంగ్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న మేకర్స్.. సినిమాపై బజ్ తగ్గకుండా జెట్ స్పీడ్ తో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మహేష్ బాబు కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ ని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.