Begin typing your search above and press return to search.

పవన్ కు పంపిణీదారుల సెగ

By:  Tupaki Desk   |   2 March 2017 7:02 AM GMT
పవన్ కు పంపిణీదారుల సెగ
X
ప్రశ్నిస్తానంటూ ప్రజల ముందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఆ పని చేయడంలో ముందూవెనకా ఆలోచిస్తుండడంతో తరచూ ప్రజల నుంచి ఆయనపై ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని.. తమ తరఫున పవన్ ప్రశ్నించాలని పలుమార్లు ప్రజలు డిమాండ్ చేసిన సందర్భాలున్నాయి. తాజాగా... పవన్ సినిమాల వల్ల నష్టపోయిన పంపిణీదారులు కూడా పవన్ పై ఒత్తిడి పెంచుతున్నారట.. తమకు జరిగిన నష్టాన్ని భర్తీచేసి న్యాయం చేసేలా పవన్ స్పందించాలని వారు కోరుతున్నారు. పవన్ ను కలిసే ఛాన్సివ్వాలని కూడా కోరుతున్నారు.

'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్లకు రూ. 8 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ విషయంలో పవన్ స్పందించి తమకు న్యాయం చేయాలని నైజాం పంపిణీదారులు కోరుతున్నారు. ఈమేరకు డిస్ట్రిబ్యూటర్లు దిలీప్ టాండన్ - తరుణ్ - డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు సునీల్ - ఉదయ్ కుమార్ రెడ్డి - శ్రీనివాస్ - సత్యనారాయణ తదితరులు జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ సినిమా దెబ్బకు నష్టపోయిన ఇతర పంపిణీదారులకు నష్ట పరిహారాన్ని చెల్లించిన నిర్మాతలు... తమకు మాత్రం చెల్లించడం లేదని వారు అంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ స్పందించాలని... తమకు న్యాయం చేయించాలని కోరారు. పవన్ ను కలిసి తమ ఆవేదనను తెలుపుకునేందుకు ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నామని... కానీ, అతన్ని కలిసే అవకాశం తమకు లభించడం లేదని చెప్పారు. ఈ విషయం పవన్ దృష్టికి వెళితే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు.

పవన్ తాజా చిత్రం 'కాటమరాయుడు' హక్కులను తక్కువ రేటుకే ఇచ్చి, సర్దార్ సినిమా నష్టాన్ని పూడుస్తామని చెప్పిన నిర్మాత శరత్ మరార్, పవన్ కల్యాణ్ మేనేజర్ శ్రీనివాస్ లు... ఇప్పుడు రైట్స్ తమకు ఇవ్వకుండానే మరో డిస్ట్రిబ్యూటర్ అమ్మారని నష్టపోయి పంపిణీదారులు ఆరోపిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/