Begin typing your search above and press return to search.

ఇంకా సెట్స్ కెళ్ల‌క‌ముందే నిర్మాత‌కు 15 కోట్ల న‌ష్ట‌మా?

By:  Tupaki Desk   |   7 May 2020 8:30 AM GMT
ఇంకా సెట్స్ కెళ్ల‌క‌ముందే నిర్మాత‌కు 15 కోట్ల న‌ష్ట‌మా?
X
భారీ పాన్ ఇండియా సినిమాకి స‌న్నాహ‌కం మొద‌లెట్టారు. క‌థ- బౌండ్ స్క్రిప్టు రెడీ. ఆర్టిస్టులు సిద్ధం. క‌ళాద‌ర్శ‌కులు భారీ ప్రాకారాల‌తో సెట్లు వేసేశారు. ఇక సెట్స్ కెళ్లిపోవ‌డ‌మే ఆల‌స్యం అనుకుంటుండ‌గా బిగ్ బాంబ్. క‌రోనా మ‌హమ్మారీ చైనా నుంచి త‌రుముకొచ్చింది. ఇండియాను అట్టుడికిస్తోంది. ఆ క్ర‌మంలోనే ఆ సినిమా చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. దీని ప‌ర్య‌వ‌సానం ఇంకా సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే.. ఏకంగా 15 కోట్ల మేర నిర్మాత‌లు న‌ష్ట‌పోతున్నార‌ట‌. ఇప్పటికే రెడీ అయిన సెట్ల‌కు స్టూడియో నిర్వాహ‌కుల‌కు రోజువారీ అద్దె చెల్లించాల్సి వ‌స్తోంది. దానికంటే సెట్లు కూల్చేసి తిరిగి అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు నిర్మించుకోవ‌డ‌మే బెట‌ర్ అనుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదంతా ఏ ప్రాజెక్టు గురించి? అంటే..

ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టించ‌నున్న త‌దుప‌రి చిత్రం `గంగూబాయి క‌తియావాడీ` గురించే. క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ మ‌రోసారి భారీ సెట్లు నిర్మించి తీస్తున్న సినిమాగా ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. ఆలియా ఈ చిత్రంలో కామ‌టిపురా శృంగార నాయిక‌గా క‌నిపించ‌నుంది. అందుకోసం కామ‌టిపురా అనే వీధినే సెట్ల‌లో రీక్రియేట్ చేశార‌ట‌. ఇక ఈ మూవీని త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి ప్రాణం పెట్టేందుకు ఆలియా సిద్ధ‌మైంది. అయితే ఇంత‌లోనే క‌రోనా దుంప తెంచేసింది. క‌లల్ని క‌ల్ల‌లు చేసేసింది. ఈ సినిమాలో న‌టిస్తే త‌న‌కు దీపిక ప‌దుకొనే స్థానం ద‌క్కుతుంద‌ని ఆలియా భావించింద‌ట‌. దీపిక‌కు ప‌ద్మావ‌త్ 3డిలో రాజ్ పుత్ రాణిగా న‌టించినందుకు ప్ర‌జ‌లు-అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. భ‌న్సాలీ చిత్రంలో న‌టిస్తే అంత పెద్ద పేరొస్తుంద‌ని ఆలియా క‌ల‌లు కంది. స్టూడియో వాళ్లు భారీ బిల్లులు బాదేస్తుంటే అది త‌ట్టుకోవ‌డం కంటే సెట్లు కూల్చ‌డ‌మే బెట‌ర‌ని ఇప్ప‌టికే భ‌న్సాలీ భావించారు. ఇక ఇది వ‌ర్షాకాలం కాబ‌ట్టి సెట్లు వ‌దిలేసినా ఉప‌యోగం ఉండ‌ద‌ని భావించార‌ట‌.

``ఈ నిర్ణ‌యం స‌రైన‌దే. ఎందుకంటే షూట్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఫిల్మ్ సిటీకి సెట్ కోసం నిర్మాతలు రోజువారీ అద్దె చెల్లిస్తున్నారు. షూట్ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఇప్ప‌టివ‌ర‌కూ ఖ‌ర్చుల‌పై లెక్క‌లు తేల్చారు. ఎప్పుడో సెప్టెంబర్-అక్టోబర్ వ‌ర‌కూ లాక్ డౌన్ ఎత్తేయ‌ర‌ని అర్థ‌మ‌వుతోంది. అందుకే సెట్ ప‌డ‌గొట్టి తిరిగి క‌ట్టుకోవ‌డ‌మే మేలు`` అని భ‌న్సాలీ టీమ్ భావించింద‌ట‌. మొత్తానికి క‌రోనా ఆలియా పైనా.. భ‌న్సాలీ పైనా పిడుగులా ప‌డింద‌ని ఈ ప‌రిణామం చెబుతోంది. ఇక భన్సాలీ ఎప్పుడు సినిమా తీసినా ఏదో ఒక వివాదం నిర్మాత‌ల‌కు పెనుగండంగానే మారింది. గ‌తంలో ప‌ద్మావ‌త్ చిత్రం తీస్తున్న‌ప్పుడు రాజ్ పుత్ ల‌తో వివాదం నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు తెచ్చింది. అయితే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో చాలా వ‌ర‌కూ మ‌నీ రీక‌వ‌రీ అయ్యింది.