Begin typing your search above and press return to search.

ఆర్జీవీ సినిమాల వెనుక మతలబేంటి..?

By:  Tupaki Desk   |   28 Aug 2020 11:40 PM IST
ఆర్జీవీ సినిమాల వెనుక మతలబేంటి..?
X
కరోనా టైంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు.. రామ్ గోపాల్ వర్మ పై తీస్తున్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ పై 'పవర్ స్టార్' అనే సెటైరికల్ సినిమా తీసిన వర్మకి కౌంటర్ గా అతన్ని టార్గెట్ చేస్తూ 'పరాన్నజీవి' అనే సినిమా తీసి రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ''ఆర్జీవీ'' (రోజూ గిల్లే వాడు) అనే సినిమా తీస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ''పార్న్ జీవి - పెళ్ళాం వదిలేసిన ఒక దర్శకుడి కథ'' ''ఎవడ్రా నన్ను కొట్టింది'' ''రాడ్‌ గోపాల్ వ‌ర్మ‌'' ''రాంగ్ గోపాల్ వర్మ'' అనే మరో నాలుగు సినిమాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమాలన్నీ సైడ్ అయిపోవడానికి రామ్ గోపాల్ వర్మ తన వాళ్ళతో తన మీదే సినిమాలు రూపొందిస్తున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కాగా రామ్ గోపాల్ వర్మ ని టార్గెట్ చేస్తూ లెక్కలేనన్ని సినిమాలు తెరకెక్కిస్తున్న సమయంలో ఆర్జీవీ స్వయంగా తన బయోపిక్ తెరకెక్కబోతోంది అంటూ ప్రకటించాడు. తన బయోపిక్ ''రాము'' ''రామ్ గోపాల్ వర్మ'' ''ఆర్.జి.వి'' అనే మూడు భాగాలుగా రాబోతోందని.. దొరసాయి తేజ దర్శకత్వంలో బొమ్మాకు మురళి నిర్మించనున్నారని.. 'ఆర్.జి.వి' సినిమాలో తనే స్వయంగా నటించనున్నట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ఈ బయోపిక్ లో నా చుట్టూ అలుముకున్న‌ వివాదాలు.. శృంగార స‌న్నివేశాలు.. అమ్మాయిల‌తో పెట్టుకున్న సంబంధాల‌ను కూడా చూపిస్తానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాజాగా ''సైకో వర్మ'' అనే మరో సినిమా రాబోతోంది. దీనికి 'వీడు తేడా' అనే ఉపశీర్షిక పెట్టారు. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన 'పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయ్' అంటూ సాగే ఓ పాట ప్రోమోని రిలీజ్ చేశారు. 'సైకో వర్మ' చిత్రాన్ని నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మిస్తున్నాడు.

అయితే ఇప్పుడు రీసెంట్ గా అనౌన్స్ చేసిన 'సైకో వర్మ' సినిమా ప్రొడ్యూసర్ నట్టి కుమార్ వర్మ తీసిన 'మర్డర్' సినిమాకి నిర్మాత అవడం ఇక్కడ గమనార్హం. ఆర్జీవీ తీస్తున్న సినిమాకి.. ఆర్జీవీపై తీస్తున్న సినిమాల రెండిటికి ప్రొడ్యూసర్ ఒకరే అవడంలో మతలబేంటని.. ఆర్జీవీ తనని టార్గెట్ చేస్తూ సినిమాలను సైడ్ ట్రాక్ ఎక్కించాలానే ప్లాన్ తో కావాలనే తనపై తన వారితో సినిమాలు రూపొందిస్తున్నాడని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు బయోపిక్ అంటూ మరోవైపు నెగిటివ్ టైటిల్స్ తో సినిమాలు రూపొందిస్తూ పబ్లిసిటీ కోసం వర్మ పెద్ద ప్లానే వేసాడని విమర్శిస్తున్నారు. ఏదేమైనా ఆర్జీవీ మాత్రం తన పబ్లిసిటీ స్టంట్స్ తో కరోనా వైరస్ తో సమానంగా వార్తల్లో నిలుస్తున్నాడని చెప్పవచ్చు.