Begin typing your search above and press return to search.

సైలెంట్ అయిపోయిన సమంత..!

By:  Tupaki Desk   |   2 Jun 2021 10:30 AM GMT
సైలెంట్ అయిపోయిన సమంత..!
X
స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ''ది ఫ్యామిలీ మ్యాన్ 2'' వెబ్ సిరీస్ లో ఓటీటీ వరల్డ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. 'ఫ్యామిలీ మ్యాన్' కు కొనసాగింపుగా వస్తున్న ఈ సిరీస్ ను దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందిస్తున్నారు. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఈ సిరీస్, ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేసి భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.

రాజ్ అండ్ డీకే - మనోజ్ బాజ్ పాయ్ - ప్రియమణి లతో పాటుగా సమంత కూడా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని భావించిన సామ్ కూడా జాతీయ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సమంత ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వస్తోంది. దీనికి కారణం ట్రైలర్ విడుదల తర్వాత అనుకోని విధంగా ఈ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకోవడమే అని అర్థం అవుతోంది.

'ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ మిలియన్ల కొలదీ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే సమయంలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. తమిళుల మనోభావాలను కించపరిచారని.. తమిళ టైగర్స్ ని ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులున్నట్లు చూపించారని సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమిళమ్మాయి అయిన సమంత అలాంటి పాత్రలో నటించడం ఏంటని ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సమంత ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది.

నిజానికి ఫ్యామిలీ మ్యాన్ ట్రోల్స్ పై సమంత ఇంతవరకు స్పందించలేదు. దీనిపై సైలెంట్ గా ఉంటూ వస్తున్న సామ్.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా అదే పాటిస్తోంది. సిరీస్ హిట్ అయితే ఎలాగూ బాలీవుడ్ లో రావాల్సిన ఫేమ్ వస్తుంది కాబట్టి, మీడియాకు సోషల్ మీడియాకు దూరంగా ఉండటమే మంచిదని అనుకుంటోందట. అంతేకాదు 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ చూసిన తర్వాత జనాలు తనను అర్థం చేసుకుంటారని సమంత భావిస్తున్నారట.