Begin typing your search above and press return to search.

శ్యామ్‌ కె.నాయుడు-సాయిసుధ కేసులో కొత్త ట్విస్టు

By:  Tupaki Desk   |   30 Jun 2020 3:45 AM GMT
శ్యామ్‌ కె.నాయుడు-సాయిసుధ కేసులో కొత్త ట్విస్టు
X
‘అర్జున్ రెడ్డి’ సహా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన సాయిసుధ.. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ఈ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేష‌న్లో సాయి సుధ చేసిన ఫిర్యాదు మేరకు.. విచారణ జరిపిన పోలీసులు శ్యామ్ కె.నాయుడును అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఐతే అరెస్టయిన రెండు రోజులకే బెయిల్ మీద బయటికి వచ్చాడు శ్యామ్. సాయిసుధతో తాను కాంప్రమైజ్ అయినట్లు పేర్కొంటూ ఇద్దరి సంతకాలతో కూడిన పత్రాలతో పిటిష‌న్ వేయ‌డంతో నాంప‌ల్లి కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కేసు సద్దుమణిగినట్లే అని.. ఆఫ్ ద కోర్టు ఇద్దరూ సెటిల్ చేసుకోబోతున్నారని అంతా అనుకున్నారు.

కానీ ఈ కేసులో ఇప్పుడు కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కేసు విషయంలో శ్యామ్‌తో సాయిసుధ రాజీకి రాలేదని వెల్లడైంది. ఆమె సంతకాన్ని మార్ఫింగ్ చేయడం ద్వారా రాజీ పత్రాలతో నాయుడు బెయిల్ పిటిష‌న్ వేసిన‌ట్టు వెలుగులోకి వచ్చింది. బెయిల్ పిటిషన్ సవాల్ చేస్తూ మరోసారి కోర్టును ఆశ్రయించింది సాయి సుధ.

దొంగ సంతకం పెట్టి, బెయిల్‌కు తాను అంగీకరించినట్లు శ్యామ్ న‌కిలీ పత్రాన్ని సృష్టించాడ‌ని సాయిసుధ న్యాయ స్థానానికి చెప్పడం తో కోర్టు అతడి బెయిల్ రద్దు చేసింది. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కు ఒకప్పుడు శ్యామ్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్. పోకిరి, దేశముదురు, సూపర్‌, బిజినెస్‌మాన్‌ తదితర సినిమాలకు శ్యామ్‌ కెమెరామన్‌ గా పనిచేశాడు. ఓ సినిమా చిత్రీకరణ సందర్భం గా శ్యామ్‌ తో పరిచయం జరిగిందని.. ఐదేళ్ల పాటు తాము సహ జీవనం చేశామని సాయిసుధ ఇంతకు ముందు చేసిన ఫిర్యాదు లో పేర్కొంది.