Begin typing your search above and press return to search.

మహేష్ కోసం సాయిమాధవ్ బుర్రా

By:  Tupaki Desk   |   10 Sep 2015 12:12 PM GMT
మహేష్ కోసం సాయిమాధవ్ బుర్రా
X
టాలీవుడ్ లో మహేష్ తో సినిమా చేయడానికి చాలామంది పెద్ద దర్శకులు లైన్ లో ఉన్నారు. వాళ్లందరూ సొంత కథలతోనే మహేష్ ను లైన్ లో పెట్టడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే మహేష్ మాత్రం తనే సొంతంగా ఓ కథ రాయించే పనిలో ఉన్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. కృష్ణం వందే జగద్గురుం, గోపాల గోపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాలతో మాటల రచయితగా మంచి పేరు సంపాదించిన సాయిమాధవ్ బుర్రాతో మహేష్ ఓ కథ రాయిస్తున్నట్లు సమాచారం.

సాయిమాధవ్ ను ముంబయికి పంపించి.. అక్కడ సకల సౌకర్యాలు కల్పించి.. మహేష్ కథ రాయిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు మహేష్ భార్య నమ్రతే చూస్తోందట. ఇప్పటిదాకా మహేష్ ఎప్పుడూ దర్శకుల బాటలో నడిచాడు. ఇలా ఓ రచయితతో తనే కథ రాయించడమన్నది తొలిసారి అని చెప్పాలి. కొత్తగా ‘మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్’ పేరుతో నిర్మాణ సంస్థ ఆరంభించిన నేపథ్యంలో ఆ బేనర్ లో సినిమా చేయడానికేనా ఈ కథ అని సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకు దర్శకుడెవరో చూడాలి.

మొదట మాటల రచనకే పరిమితమైన సాయిమాధవ్.. ఈ మధ్య స్టోరీ డిస్కషన్స్ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సాయిమాధవ్ పని తీరు నచ్చి పవన్ కళ్యాణ్ సైతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు అతడి సహకారం తీసుకున్నాడు. మరికొందరు హీరోలు కూడా సాయిమాధవ్ తో టచ్ లో ఉంటున్నారు. ఇప్పడు మహేష్ ప్రత్యేకంగా సాయితో కథ రాయిస్తున్నాడంటే అతడి వాల్యూ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.