Begin typing your search above and press return to search.

సాయికుమార్ ఫ్యామిలీ ఎందుకలా చేసింది?

By:  Tupaki Desk   |   24 Dec 2015 5:30 PM GMT
సాయికుమార్ ఫ్యామిలీ ఎందుకలా చేసింది?
X
పెద్ద పెద్ద నిర్మాతలే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల నిర్మాణం మంచిది కాదని వెనక్కి తగ్గుతున్న రోజులివి. సినిమాల నిర్మాణం జూదంగా మారిపోతుండటం.. సక్సెస్ రేట్, లాభాల శాతం బాగా పడిపోతుండటమే దీనికి కారణం. ఇలాంటి సమయంలో సాయికుమార్ ఫ్యామిలీ ఓ బేనర్ పెట్టి.. ఆది హీరోగా ‘గరం’ సినిమా చేయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. మూడు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఈ ఫ్యామిలీ ఇప్పటిదాకా నిర్మాణం జోలికి వెళ్లలేదు. ఐతే హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న ఆదిని పెట్టి అతడి మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టి సినిమా తీయడం అన్నది పెద్ద రిస్కే అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఐతే ‘గరం’ సినిమాను నిర్మించడానికి వేరే కారణం ఉందని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు టేకప్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు ఆది. ‘‘ఈ సినిమాను వేరే నిర్మాత మొదలుపెట్టాడు. కానీ షూటింగ్ మొదలైన పది రోజులకే తప్పుకున్నాడు. దీంతో మేమే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాం. శ్రీనివాస్ గవిరెడ్డి అందించిన కథ మీద, దర్శకుడు మదన్ మీద నమ్మకంతోనే నిర్మాణానికి ముందుకు వచ్చాం. షూటింగ్ ఆగడం వల్ల డేట్ల విషయంలో సమస్య తలెత్తింది. దీంతో సినిమా మరింత ఆలస్యమైంది. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను పూర్తి చేశాం. మంచి ఫలితం అందుకుంటామన్న ఆశతో ఉన్నాం’’ అన్నాడు ఆది. ‘గరం’తో చాలించకుండా ఇకముందు కూడా తమ బేనర్లో సినిమాలు నిర్మించే ఆలోచన ఉన్నట్లు ఆది తెలిపాడు.