Begin typing your search above and press return to search.

ఇంతకీ 'బ్రహ్మాస్త్ర' లో బాద్ షా పాత్ర ఏంటి..?

By:  Tupaki Desk   |   17 Jun 2022 3:29 AM GMT
ఇంతకీ బ్రహ్మాస్త్ర లో బాద్ షా పాత్ర ఏంటి..?
X
బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సోషల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - కింగ్ అక్కినేని నాగార్జున - మౌనీ రాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

బ్రహ్మాస్త్ర - అగ్ని అస్త్ర - నంది అస్త్ర వంటి వివిధ అస్త్రాల విశిష్టతను.. అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రం గురించి తెలియజేసే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో డీజే శివ మరియు అగ్ని అస్త్రగా రణవీర్.. నంది అస్త్ర అనిష్ శెట్టిగా నాగ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో శివుడిగా షారుక్‌ ఖాన్‌ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.

బిగ్ స్క్రీన్‌ పై బాద్షాను శివుడిగా ఆవిష్కరించడానికి 'బ్రహ్మాస్త్ర' టీమ్ CGI టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో రాహుల్ అగర్వాల్ అనే సైంటిస్ట్ గా షారుఖ్ కనిపించనున్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'బ్రహ్మాస్త్ర' లో షారుఖ్ రోల్ ఏంటనే దానిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాలో బాద్ షా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇదే క్రమంలో 'లాల్ సింగ్ చద్దా' 'టైగర్ 3' వంటి చిత్రాల్లోనూ షారుక్ స్పెషల్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం.

షారుక్ ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్' అనే సినిమా చేస్తున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2023 జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలానే షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జవాన్' అనే యాక్షన్ థ్రిల్లర్ ను 2023 జూన్ 2న విడుదల చేయనున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ 'డంకీ' అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.

'బ్రహ్మాస్త్ర' విషయానికొస్తే.. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ని తెలుగులో ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం-శివ'' పేరుతో 2022 సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లో ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌ లైట్ పిక్చర్స్ సంస్థలు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.