Begin typing your search above and press return to search.

'2.0' తో నింపేయబోతున్నారు

By:  Tupaki Desk   |   24 Nov 2018 11:22 AM GMT
2.0 తో నింపేయబోతున్నారు
X
కొంత విరామం తర్వాత బాక్సాఫీస్‌లో వేడి పుట్టించే.. సినీ ప్రేక్షకుల్ని వెర్రెత్తించే సినిమా వస్తోంది. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘2.0’ వచ్చే గురువారమే థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మామూలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజవుతోందంటే దక్షిణాదిన మాత్రమే ఎక్కువ హంగామా ఉంటుంది. ఐతే ‘రోబో’కు సీక్వెల్ కావడం వల్ల.. అలాగే అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేయడం వల్ల ఉత్తరాదిన కూడా దీనికి క్రేజ్ కనిపిస్తోంది. ఇక దక్షిణాది విషయానికి వస్తే.. ప్రతి రాష్ట్రంలోనూ ‘2.0’ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తోంది. విశేషం ఏంటంటే.. సౌత్ మొత్తంలో అత్యంత భారీగా ‘2.0’ రిలీజవుతున్నది తెలుగు రాష్ట్రాల్లోనే. ఏపీ-తెలంగాణల్లో కలిపి ఉన్నన్ని థియేటర్లు దక్షిణాదిన మరే రాష్ట్రంలోనూ లేవు.

‘2.0’ బేసిగ్గా తమిళ సినిమా అయినప్పటికీ.. తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఎక్కువ థియేటర్లలో రిలీజవుతోంది. వెయ్యికి పైగా థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళనాట ఈ సినిమా 600-700 మధ్య స్క్రీన్లలో మాత్రమే రిలీజవుతోంది. ఇక ‘2.0’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు మెజారిటీ థియేటర్లలో ఈ చిత్రాన్ని నింపేయబోతున్నారు. నైజాం ఏరియాలో మాత్రమే ఈ చిత్రానికి 400 థియేటర్లు దక్కాయి. దిల్ రాజు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటంతో మాగ్జిమం థియేటర్లను దీనికి అట్టి పెడుతున్నాడు. తొలి రోజు హైదరాబాద్‌లో మాత్రమే 600 షోల దాకా వేయనున్నారట. అంటే వందకు పైగా థియేటర్లలో ఈ చిత్రం ఆడే అవకాశముంది. ఏపీలో సైతం మాగ్జిమం థియేటర్లలో ‘2.0’ను ఆడించబోతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో తొలి వారాంతంలోనే సాధ్యమైనంత మొత్తం వెనక్కి రాబట్టుకోవాలని చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.