Begin typing your search above and press return to search.

సరయు కోసం వచ్చి వెన్నెల అయ్యాను : రేణు

By:  Tupaki Desk   |   18 April 2019 10:55 AM IST
సరయు కోసం వచ్చి వెన్నెల అయ్యాను : రేణు
X
పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్యగా రేణు దేశాయ్‌ కి ఇప్పటికి కూడా మంచి క్రేజ్‌ ఉంది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా కూడా పవన్‌ కళ్యాణ్‌ తో ప్రేమ, పెళ్లి, పిల్లలు కారణంగా రేణు దేశాయ్‌ ఇక్కడి వారికి సుపరిచితం అయ్యింది. రేణు దేశాయ్‌ ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా ఇక్కడ దాని గురించి చర్చ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రేణు దేశాయ్‌ అప్పుడప్పుడు పవన్‌ అభిమానుల కారణంగా ఇబ్బంది పడుతూనే ఉంది. ఇక తాజాగా అలీతో సరదాగా ఇంటర్వ్యూలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాల గురించి రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది.

ఇదే కార్యక్రమంలో తనకు సినిమాలో మొదటి ఛాన్స్‌ ఎలా వచ్చిందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. రేణు మాట్లాడుతూ.. ముంబయిలో మోడలింగ్‌ చేస్తున్నాను. ఆ సమయంలోనే నా ఫొటో పూరి జగన్నాధ్‌ గారి వద్దకు వెళ్లింది. తాను రాసుకున్న బద్రి కథకు హీరోయిన్‌ గా నేను అయితే బాగుంటాను అనిపించిందట. అందుకే ఆ నా ఫొటోను అట్టి పెట్టుకున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ గారు కథకు ఓకే చెప్పగానే సరయు పాత్రకు ఈమె అంటూ నా ఫొటో చూపించాడట. ఆ తర్వాత నా వద్దకు వచ్చి సినిమాలో నటించమంటూ అడిగాడు. కాని నాకు సినిమాలపై ఆసక్తి లేదని చెప్పాను. కాని కథ విన్న తర్వాత చేయాలనిపించింది. సరయు పాత్రకు గాను నన్ను ఎంపిక చేయడం జరిగింది.

పవన్‌ కళ్యాణ్‌ అనే పేరు నేను అప్పటి వరకు వినలేదు. తెలుగు హీరోలు అంటే ముంబయిలో చిరంజీవి, వెంకటేష్‌, నాగార్జున పేర్లు మాత్రమే వినిపించేవి. అయితే హైదరాబాద్‌ వచ్చిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ గారి స్టార్‌ డం నాకు తెలిసింది. తమ్ముడు సినిమా షూటింగ్‌ సమయంలో ఆయన్ను కలిశాను. సరయు పాత్రకు సరైన అమ్మాయిగా నన్ను అనుకున్నారు. అయితే షూటింగ్‌ ప్రారంభంకు కొన్ని రోజుల ముందు సరయు పాత్ర కంటే నేను వెన్నెల పాత్రకు అయితే బాగా సూట్‌ అవుతాను అనుకున్నారు. అందుకే అల్లరి అమ్మాయి అయిన వెన్నెల పాత్రను పూరి గారు నాతో చేయించాడు. అలా నేను బద్రి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యానని రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చింది. బద్రి చిత్రం సమయంలోనే పవన్‌ తో రేణు దేశాయ్‌ పరిచయం - ప్రేమ - ఆ తర్వాత సహజీవనం చేసిన విషయం తెల్సిందే.