Begin typing your search above and press return to search.

దర్శకుల రుణం తీర్చుకుంటున్న రష్మిక!!

By:  Tupaki Desk   |   12 Feb 2020 5:15 AM GMT
దర్శకుల రుణం తీర్చుకుంటున్న రష్మిక!!
X
ప్రస్తుతం టాలీవుడ్‌ లో రష్మిక మందన్న మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. ఈ అమ్మడు స్టార్‌ హీరోతో వరుసగా చిత్రాలు చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత ఈ అమ్మడి క్రేజ్‌ మరింతగా పెరిగి పోయింది. అయినా కూడా నితిన్‌.. నాగచైతన్య వంటి చిన్న హీరోలకు ఓకే చెప్తూ ఆశ్చర్యపర్చుతోంది. నితిన్‌ తో భీష్మ చిత్రం చేసిన ఈ అమ్మడు తాజాగా నాగచైతన్యతో ‘నాగేశ్వరరావు’ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

నాగచైతన్యతో రష్మిక మందన్న నటించేందుకు ఓకే చెప్పడానికి కారణం దర్శకుడు పరుశురామ్‌. ఈయన దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం చిత్రం కారణంగా రష్మిక స్టార్‌ మారింది. అందుకే ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో రష్మిక మందన్న కాస్త తగ్గి.. పారితోషికం విషయంలో కూడా కొంత మేరకు తగ్గి నాగచైతన్యతో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఈ చిత్రం మాత్రమే కాకుండా భీష్మ చిత్రానికి కూడా రష్మిక అందుకే ఒప్పుకుందంటున్నారు.

రష్మికను తెలుగుకు పరిచయం చేసింది వెంకీ కుడుముల. ఆయన ఛలో చిత్రంలో అవకాశం ఇచ్చాడు కనుకే ఇప్పుడు ఆయన చేసిన భీష్మ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుందని అంటున్నారు. మొత్తానికి తన మొదటి రెండు చిత్రాల దర్శకులకు వారి తదుపరి చిత్రాల్లో నటించి రుణం తీర్చుకుంది.

స్టార్‌ హీరోలతో నటించే ముద్దుగుమ్మలు జూనియర్‌ హీరోలతో నటించేందుకు ఆసక్తి చూపించరు. కాని రష్మిక మాత్రం దర్శకులపై గౌరవంతో వారి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రెండు సినిమాల్లో నటించింది.. నటించబోతుందని టాక్‌ వినిపిస్తుంది.