Begin typing your search above and press return to search.

'ఆచార్య‌'కు చిరు-చ‌ర‌ణ్ పైసా కూడా తీసుకోలేద‌ట‌!

By:  Tupaki Desk   |   24 April 2022 2:00 PM IST
ఆచార్య‌కు చిరు-చ‌ర‌ణ్ పైసా కూడా తీసుకోలేద‌ట‌!
X
`ఆచార్య‌`.. ఇప్పుడు అంద‌రి చూపులు దీనిపైనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇంత‌కు ముందు ఈ తండ్రీకొడుకులు ఒక‌రి సినిమాలో మ‌రొక‌రు గెస్ట్ రోల్స్ చేశారు. కానీ, ఈ సారి మాత్రం పూర్తి స్థాయి పాత్ర‌ల‌తో మెగా అభిమానులను, సినీ ప్రియుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యారు. గ‌త ఏడాది చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను మొద‌లు పెట్టిన ఆచార్య టీమ్‌.. నిన్న హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముఖ్య అతిధిగా విచ్చేసి సినిమాపై మ‌రింత బ‌జ్ ఏర్ప‌డేలా చేశారు. అయితే ఈ ఈవెంట్ లో ఆచార్య నిర్మాత‌, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అధినేత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. చిరు, చ‌ర‌ణ్ ల రెమ్యున‌రేష‌న్‌ గురించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు.

గ‌తంలో ఆచార్య కోసం చిరంజీవి రూ. 45 కోట్లు, రామ్ చ‌ర‌ణ్ రూ. 30 కోట్లు తీసుకున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ, వాస్త‌వానికి చిరు, చ‌ర‌ణ్ లు ఆచార్య కోసం ఇప్ప‌టి వ‌ర‌కు పైసా కూడా తీసుకోలేద‌ట‌. ఈ విష‌యాన్ని నిరంజ‌న్ రెడ్డి స్వ‌యంగా తెలిపారు. `త‌మ హీరోల రెమ్యున‌రేష‌న్ గురించి ఇన్నాళ్లు జ‌రిగిన‌ ప్ర‌చారం అవాస్తవం. చిరు, చ‌ర‌ణ్‌లిద్ద‌రూ ఎలాంటి డబ్బు తీసుకోకుండానే ఆచార్య‌లో న‌టించారు.

సినిమా రిలీజ్ అయ్యాక దానికి వచ్చే ఫలితం మరియు వసూళ్ల బట్టి చూద్దామ‌ని వారు చెప్పారు` అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, సందేశాత్మక కథకు మాస్‌ కమర్షియల్‌ అంశాలన్నీ జోడించి కొర‌టాల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో చిరంజీవి స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే.. రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా పూజా హెగ్డే చేసింది. సోనుసూద్, తనికెళ్ళ భరణి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. క్రేజీ హీరోయిన్ రెజీనా ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది. మెలోడీ బ్రహ్మ మ‌ణిశ‌ర్మ ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కి సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.