Begin typing your search above and press return to search.

ఉపరాష్ట్రపతి ప్రశంసలు అందుకుంటున్న 'ఓల్డ్ సీరియల్'

By:  Tupaki Desk   |   4 May 2020 9:00 PM IST
ఉపరాష్ట్రపతి ప్రశంసలు అందుకుంటున్న ఓల్డ్ సీరియల్
X
గతంలో టీవీలో అశేషమైన ప్రేక్షకాదరణ పొందిన సీరియళ్లు రామాయణం - మహాభారతం. ఆ తర్వాత చారిత్రాత్మక ధారావాహికలు ఎన్నో వచ్చాయి. కానీ అంతటి క్రేజ్ మాత్రం పొందలేక పోయాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పాత సీరియల్స్ దూరదర్శన్ లో పునఃప్రసారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామాయణం సీరియల్ దూరదర్శన్ లో ప్రసారం అవుతుంది. రామానంద్‌ సాగర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన రామాయణం సీరియ‌ల్ మొదటగా 1987లో దూరదర్శన్‌ ఛానల్లో ప్రసారం అయింది. లాక్‌ డౌన్ వ‌ల‌న మ‌ళ్లీ 33 ఏళ్ళ త‌ర్వాత ఈ సీరియ‌ల్ దూర‌ద‌ర్శ‌న్‌ లో మళ్లీ ప్రసారం చేస్తున్నారు. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 16 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌ ను 7.7 కోట్ల మంది వీక్షించారట. ఇది ప్రపంచరికార్డు అని డీడీ నేషనల్‌ చానల్‌ అధికారికంగా ప్రకటించింది.

ప్ర‌పంచంలో మ‌రే టీవీ సీరియ‌ల్‌ కానీ - షో కానీ సాధించని మరో రికార్డును కూడా సృష్టించింది రామాయణం. హాలీవుడ్ కార్యక్రమాలను కూడా రామాయణం బ్రేక్ చేసే స్థాయిలో వ్యూయ‌ర్‌ షిప్ సంపాదించింది. ప్ర‌ముఖ హాలీవుడ్ షో గేమ్ ఆఫ్ థ్రోన్ ఒక్క రోజులో 1.85 కోట్ల వ్యూయ‌ర్ షిప్‌ తో రికార్డు నెల‌కొల్ప‌గా.. షిప్ ది బిగ్ బ్యాంగ్ థియ‌రీ 1.7 కోట్ల వీక్ష‌ణ‌ల‌తో రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ సీరియల్ దూరదర్శన్ లో రికార్డుల మోత మోగిస్తుంది. తాజాగా రామాయ‌ణం సీరియ‌ల్ ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు స్పందించి.. "ఓల్డ్ ఈజ్ గోల్డ్" అని ప్ర‌శంసించారు. "మన గొప్ప సాంస్కృతిక - జానపద సంప్రదాయానికి కొత్త తరాన్ని పరిచయం చేయడంలో దూరదర్శన్ చేసిన ఈ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను" అని సోషల్ మీడియా వేదికగా వెంకయ్య నాయుడు స్ప‌ష్టం చేశారు.