Begin typing your search above and press return to search.

ఖుషీ సీక్వెల్ ప‌నులు మొద‌ల‌య్యాయ్‌!

By:  Tupaki Desk   |   13 March 2016 4:20 PM GMT
ఖుషీ సీక్వెల్ ప‌నులు మొద‌ల‌య్యాయ్‌!
X
ఒక సినిమా పూర్త‌య్యాక కానీ మ‌రో సినిమా గురించి ఆలోచించ‌డు ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్టోరీ డిస్క‌ష‌న్ల కోస‌మే బోలెడంత స‌మ‌యం తీసుకుంటుంటాడు. అందుకే ఆయ‌న ప్ర‌యాణం మొద‌లై రెండు ద‌శాబ్దాల‌వుతున్నా ఇర‌వైకి మించి సినిమాలు చేయ‌లేదు. ఇంత‌లో ఏకంగా సినిమాల‌కి గుడ్ బై చెబుతానని ప్ర‌క‌టించాడు. రెండు మూడు సినిమాల‌కి మించి చేయ‌నంటున్నాడు. వ‌చ్చే ఎలెక్ష‌న్ ల‌లో త‌న జ‌న‌సేనని దించాల‌ని, అప్ప‌ట్లోపు తాను అనుకున్న ఆ రెండు మూడు సినిమాల్ని పూర్తి చేయాల‌ని డిసైడైయ్యాడు. స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నందున ప‌వ‌న్ ఇటీవ‌ల వేగం పెంచిన‌ట్టు తెలుస్తోంది. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ఇంకా పూర్తికాక మునుపే కొత్త సినిమా ప‌నుల్ని మొద‌లుపెట్టించాడు.

స‌ర్దార్... త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ చేయ‌బోయే సినిమా దాదాపుగా ఖ‌రారైంది. ఖుషీ సీక్వెల్‌ లో న‌టించ‌బోతున్నాడు ప‌వ‌న్‌. ఎస్‌.జె.సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. అందుకు సంబంధించిన ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. ఆ విష‌యాన్ని ఖ‌రారు చేస్తూ రామ‌జోగ‌య్య శాస్త్రి ట్విట్ట‌ర్‌ లో ఓ ఫొటోని పోస్ట్ చేశారు. ఎస్‌.జె.సూర్య‌ - అనూప్ రూబెన్స్‌ - ర‌చ‌యిత ఆకుల శివ‌ల‌తో క‌లిసి తీసుకొన్న ఓ సెల్ఫీని రామ‌జోగ‌య్య పోస్ట్ చేశారు. దీన్నిబ‌ట్టి ఆ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా - రామ‌జోగ‌య్య శాస్త్రి పాట‌లు రాస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. అలాగే ఆకుల శివ ర‌చ‌యిత‌గా వ్యవ‌హ‌రిస్తున్నాడ‌ని తెలుస్తోంది. వ్య‌వ‌హారం పాట‌ల వ‌ర‌కు వ‌చ్చిందంటే స్క్రిప్టు ప‌నులు అన్నీ పూర్త‌యిన‌ట్టే లెక్క‌. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ విడుద‌ల కాగానే ఎక్కువగా స‌మ‌యం తీసుకోకుండా ఖుషీ2కి ప‌వ‌న్ కొబ్బ‌రికాయ కొట్టే అవ‌కాశాలున్నాయి. ఆ సినిమాని ప‌వ‌న్ మొద‌టి భార్య రేణుదేశాయ్ స్వ‌యంగా నిర్మిస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి అందులో నిజముందో లేదో తెలియాల్సి వుంది.