Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి స్టైల్లో ట్వీటిన రామ్

By:  Tupaki Desk   |   24 April 2019 7:38 AM GMT
అర్జున్ రెడ్డి స్టైల్లో ట్వీటిన రామ్
X
పదో తరగతి.. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించినప్పుడల్లా ఫెయిల్ అయ్యామని కొంతమంది.. ఆశించిన మార్కులు రాలేదని కొంతమంది అర్థాంతరంగా తనువు చాలించడం అనేది బాధాకరం అయినప్పటికీ అది కామన్ విషయంగా మారిపోయింది. ఈసారి తెలంగాణాలో ఇంటర్ ఫలితాలు వెల్లడి అయిన తర్వాత దాదాపు 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థులపై ఉన్న ఒత్తిడి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ఈ అంశంపై స్పందిస్తూ విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదని.. సమస్యతో పోరాడాలి కానీ ఇలా అర్థాంతరంగా లోకాన్ని వీడడం సరి కాదని చెప్తున్నారు.

తాజాగా ఈ అంశంపై హీరో రామ్ పోతినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. కాకపోతే 'అర్జున్ రెడ్డి' స్టైల్ లో కాస్త ఘాటుగా స్పందించాడు. "ఇంటర్ ఫలితాలే జీవితం అనుకునే నా తమ్ముళ్ళకు చెల్లెళ్ళకు.. మీరు జీవితంలో అవ్వబోయేదానికి.. చెయ్యబోయేదానికి - ఇది ఒక (బీప్) తో సమానం. దయచేసి లైట్ తీసుకోండి. ఇట్లు.. ఇంటర్ కూడా పూర్తిచెయ్యని మీ రామ్ పోతినేని #ఇంటర్ బోర్డ్ మర్డర్స్".

రామ్ ఇచ్చిన మెసేజ్ చాలా మంచిదే కానీ మధ్యలో ఘాటుగా ఒక బూతు వాడడంతో కొందరు నెటిజనులు రామ్ ను విమర్శించారు. పూరి జగన్ తో సహవాసం రామ్ ను మార్చేసిందని సెటైర్లు గుప్పించారు. మరి రామ్ వీటిని చదివాడేమో కానీ మరో ట్వీట్ లో 'ఘాటుగా' ఎందుకు స్పందించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు. "‘పార్క్‌లో కూర్చుని బిస్కెట్లు తినే పిల్ల‌ల‌కి ఎలా చెప్పినా వింటారు. బెడ్ రూమ్ లాక్ వేసుకుని లైఫ్ ఎలా అనుకునే పిల్ల‌ల‌కు నిజాలు ఇలా చెబితేనే వింటారు... ఇంట‌ర్ కూడా పూర్తి చేయని.. జాతి గ‌ర్వించే ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్‌ గారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు" అంటూ మధ్యలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఇంటర్ పూర్తి చేయలేదని.. అయినా జాతి గర్వించే ఆటగాడు అయ్యాడని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు.

రామ్ బూతు మాట వాడడం సమర్థనీయం కాదు.. ఇంటర్ బోర్డు ను మాత్రమే విమర్శించడం కరెక్ట్ కాదు కానీ సమాజం విద్యార్థులపై ప్రెజర్ పెట్టడం సమర్థనీయమా...? ప్రతిదానికి ఇంటర్ బోర్డు ఒక్కదాన్నే ఆడిపోసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఏం.. తల్లి దండ్రులు తక్కువ తిన్నారా.. పొద్దున లేచినప్పటి నుంచి నువ్వు 99% తెచ్చుకోవాలి.. లేకపోతే అలా.. ఇలా అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చెయ్యకపోతే పిల్లలు అంత సున్నిత మనస్కులుగా ఎందుకు తయారవుతారు? అందుకే ఈ విషయంలో తల్లిదండ్రుల తప్పు కూడా కొంత ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.