Begin typing your search above and press return to search.

కోర్టు గొడ‌వ‌ల్లో పంతం నెగ్గి `మ‌ర్డ‌ర్`కి రెడీ..‌?

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:36 AM IST
కోర్టు గొడ‌వ‌ల్లో పంతం నెగ్గి `మ‌ర్డ‌ర్`కి రెడీ..‌?
X
వివాదాల‌తో అంట‌కాగ‌డం.. దానినే ప్ర‌చారానికి వాడేయ‌డం ఆర్జీవీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. కోర్టుల ప‌రిధిలో పోరాటాలు సాగించి కొన్ని సార్లు గెలిచి కొన్నిసార్లు ఓడి చివ‌రికి ఏదోలా త‌న సినిమాని రిలీజ్ చేసుకోవ‌డంలో ఆరితేరిపోయిన వ‌ర్మ ఇప్పుడు అదే పంథాలో గొడ‌వ‌ల్లో నె‌గ్గి త‌న మ‌ర్డ‌ర్ సినిమాని డిసెంబ‌ర్ 24 రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఆ సంగ‌తిని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.

మ‌ర్డ‌ర్ మూవీ ఓ నిజ‌ఘ‌ట‌న ఆధారంగా రూపొందిన‌ది. అమృత‌- ప్ర‌ణ‌య్ ల ప్రేమ‌గాధ‌.. ప్ర‌ణ‌య్ హ‌త్యోదంతం నేప‌థ్యంలో తెర‌కెక్కించిన వివాదాస్ప‌ద చిత్ర‌మిది. తన సినిమా మర్డర్ తో సంబంధం ఉన్న కేసుకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నల్గోండ స్పెషల్ సెషన్స్ కోర్టు ఇంత‌కుముందు సమన్లు జారీ చేసింది. పిటిషనర్ అమృత మ‌న‌స్థాపంతో ఈ చిత్రం విడుదలను నిషేధించాలని కోరింది.

మిర్యాలగుడ నివాసితులైన ప్రణయ్ - అమృత కులాంతర వివాహం చేసుకున్న అనంత‌రం అది న‌చ్చ‌ని అమృత తండ్రి మారుతి రావు ప్ర‌ణ‌య్ ని దారుణంగా హ‌త్య చేయించారు. అత‌నిచే నియమించబడిన ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ప్రణయ్ ని దారుణంగా హత్య చేశాడు. అనంత‌రం ఖైర‌తాబాద్ ఆర్య‌వైశ్య భ‌వంతిలో మారుతీరావు ఆక‌స్మిక మ‌ర‌ణం సంచ‌ల‌న‌మైంది. ఈ మొత్తం క‌థ‌ను ఆర్జీవీ సినిమాగా తీస్తుండ‌డంతో వివాదం రాజుకుంది.

అయితే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ అమృత లేదా ప్రణయ్ కుటుంబం అనుమతి తీసుకోకుండా సినిమాను విడుదల చేయాలని ప్ర‌య‌త్నించ‌డంతో దానికి వ్య‌తిరేకంగా అమృత పోరాడారు. ఇక ఈ మూవీ ప్రోమోలో మారుతి రావు కుల పిచ్చి హింస చర్యల‌ను ‘తన కుమార్తె పట్ల ప్రేమ’ అనే కోణంలో ఆర్జీవీ చూపించారు.

‘ఫాదర్స్ డే’ (జూన్ 21) రోజున సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్ట‌ర్ విడుదల చేసి మ‌రింత అగ్గి రాజేయ‌డంతో గొడ‌వ కాస్తా ప‌రాకాష్ట‌కు చేరుకుంది. దానిపై విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అనంత‌రం అన్ని విమర్శలు ఎదుర్కొన్నా మొండివాడైన‌ రామ్ గోపాల్ వర్మ తన చర్యలను సమర్థించుకుని ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

‘తండ్రి ప్రేమ’ ప్రణయ్ హత్యకు దారితీసిందనే కథనానికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అమృత నల్గొండ కోర్టును ఆశ్రయించారు. అనంతరం కోర్టు కేసును స్పెషల్ సెషన్స్ కోర్టు నల్గోండకు బదిలీ చేసింది. జూలై 31 న కోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోర్టుకు హాజరుకావాలని షో కాజ్ నోటీసు జారీ చేసింది. అమృత తన పిటిషన్‌లో ఈ మూవీ ప్రోమోలు తనను బాధపెట్టినట్లు అనేక మంది సోషల్ మీడియా యూజర్లు ఆమెను దుర్భాషలాడిన దానిపైనా ఆవేద‌న వ్య‌క్త‌ప‌రిచింది. ఆమె వ్యక్తిగత జీవితంపై దాడి జ‌రిగింద‌న్న నివేదించారు.

ఈ చిత్రం తన గోప్యతపై దండెత్తిందని.. తన కథను పక్షపాతంతో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వాద‌న వినిపించారు అమృత‌. అనుమ‌తి లేకుండా సినిమా తీసార‌ని రిలీజ్ కానివ్వ‌కుండా నిలిపి వేయాల‌ని కోర్టులో వాద‌న‌లు వినిపించారు.

వైశ్య వర్గానికి చెందిన అమృతను వివాహం చేసుకున్నందుకు 2018 సెప్టెంబర్ లో ప్రణయ్ అనే దళిత వ్యక్తి పగటిపూట హత్యకు గురయ్యాడు. ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌ను నియమించిన అమృతా తండ్రి మారుతి రావు ఈ హత్యకు కుట్ర పన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలంగాణలోని మిర్యాలగుడలో జరిగిన సంచలనాత్మక హత్య తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహ జ్వాల‌ల్ని ర‌గిలించింది.

ఏదేమైనా దర్యాప్తు ముగిసి మారుతి రావు నేరానికి పాల్పడినట్లు రుజువు కావడానికి ముందే అతను 8 మార్చి 2020 న హైదరాబాద్ ‌లో తన ప్రాణాలను తీసుకున్నాడు. తెలుగు మీడియా సహాయంతో మారుతి రావు మరణంపై సానుభూతి వ్య‌క్త‌మైంది. మ‌ర్డ‌ర్ రిలీజ్ త‌ర్వాత అమృత వైపు నుంచి స్పంద‌న‌ ఎలా ఉండ‌నుంది? ఆర్జీవీ అభిమానులేమంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీయ‌నుంది.