Begin typing your search above and press return to search.

తప్పు అంగీకరించా.. ఇదో గుణపాఠం: రజినీకాంత్

By:  Tupaki Desk   |   15 Oct 2020 4:30 PM GMT
తప్పు అంగీకరించా.. ఇదో గుణపాఠం: రజినీకాంత్
X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెందిన ‘రాఘవేంద్ర కళ్యాణ మండపం’ఫై చెన్నై మున్సిపాలిటీ ఇటీవల ఆస్తి పన్ను విధించిన సంగతి తెలిసిందే. 6.50 లక్షల రూపాయల ఆస్తి పన్నును చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు రజినీకాంత్ కు నోటీసులు పంపించారు. దీనిని వ్యతిరేకిస్తూ రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన మార్చి 24 నుంచి రాఘవేంద్ర కళ్యాణమండపం మూసి ఉంది. అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని రజినీ తరుఫు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీ తరుఫు లాయర్ కోర్టును కోరారు.

ఈ ఆస్తిపన్ను వివాదంపై తాజాగా రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. తాను పొరపాటు చేశానని చెప్పారు. ‘రాఘవేంద్ర కల్యాణ మండపం టాక్స్ విషయంలో మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించకుండా.. చెన్నై కార్పొరేషన్ ని సంప్రదించి ఉంటే.. ఈ పొరపాటు జరిగేది కాదని.. అనుభవమే పాఠం’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ని రజినీకాంత్ జత చేశారు.తాను హైకోర్టుకెక్కి తప్పు చేశానని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు.

కరోనాకు ముందు రజనీకాంత్ చివరిసారిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన దర్బార్ లో సినిమాలో నటించారు. తదుపరి చిత్రాన్ని సిరుతై శివ దర్శకత్వంలో అన్నాట్టేలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుందని తెలిసింది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖుష్బు సుందర్ మరియు మీనా ప్రముఖ మహిళలుగా నటించగా, ప్రకాష్ రాజ్, సూరి మరియు సతీష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.