Begin typing your search above and press return to search.

'ఆచార్య' వివాదం కొనసాగుతూనే ఉందా...?

By:  Tupaki Desk   |   2 Sept 2020 9:30 PM IST
ఆచార్య వివాదం కొనసాగుతూనే ఉందా...?
X
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''ఆచార్య''. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి - కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల 'ఆచార్య' మూవీ టైటిల్ మోషన్ పోస్టర్‌ విడుదలైన నేపథ్యంలో రాజేష్ మండూరి అనే వర్థమాన రచయిత ఈ మూవీ స్టోరీ తనదే అని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. తాను రాసుకున్న కథని రెండేళ్ల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ వారికి వినిపించానని.. ఇప్పుడు అదే స్టోరీతో మైత్రీ మూవీ మేకర్స్ తో సన్నిహితంగా ఉండే కొరటాల శివ సినిమా చేస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై పలువురు ఇండస్ట్రీ పెద్దలను కూడా కలిశానని.. తెలుగు రచయితల సంఘానికి కంప్లైంట్ చేసానని.. కానీ వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ లీగల్ గా వెళ్లాలని సలహా ఇచ్చారని పేర్కొన్నాడు. అయితే ఈ వివాదంపై స్పందించిన 'ఆచార్య' మూవీ మేకర్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - కొరటాల శివ లు రాజేష్ ఆరోపణలను ఖండించారు.

ఇదిలా ఉండగా రాజేష్ మండూరి ఈ ఇష్యూ పై లీగల్ గా వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. తనకు న్యాయం చేస్తారని భావించిన డిస్ప్యూట్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించిందని.. తన స్క్రిప్ట్ మరియు సింగిల్ లైన్ ఆర్డర్‌ ను కొరటాల శివ స్క్రిప్ట్ తో సరిపోల్చి చూడకుండా డిస్ప్యూట్ కమిటీ వాటిని కొరటాలకి పంపించారని ఆరోపిస్తున్నాడట. ఈ చర్యలతో మనస్తాపం చెందిన రాజేష్ చట్టపరమైన చర్యలకు దిగాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్న రాజేష్.. కాల్ రికార్డులతో పాటు అవసరమైన ప్రూఫ్స్ రెడీ చేసి పెట్టుకున్నాడట. మరి 'ఆచార్య' వివాదానికి ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకొని ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.