Begin typing your search above and press return to search.

#EMK ః ఎట్టకేలకు అతిథులు వచ్చారు

By:  Tupaki Desk   |   17 Sep 2021 11:30 AM GMT
#EMK ః ఎట్టకేలకు అతిథులు వచ్చారు
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హోస్ట్‌ గా జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో అలా అలా సాగుతూ వస్తోంది. మొదటి రెండు ఎపిసోడ్‌ లకు మంచి రేటింగ్‌ దక్కింది. ఆ తర్వాత కూడా షో కు రేటింగ్‌ పాజిటివ్ గానే ఉంది. వారం వారం రేటింగ్‌ పెరుగుతున్న నేపథ్యంలో షో నిర్వాహకులు ఫుల్‌ జోష్ తో మరింత ముందుకు సాగేందుకు సిద్దం అవుతున్నారు. గతంలో మా టీవీలో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు లో వారం వారం గెస్ట్‌ లు వచ్చే వారు. వారితో ఒక రోజు ఆట కొనసాగేది. తద్వార ఎంటర్‌ టైన్మెంట్‌ ఎక్కువగా ఉండేది. ఈసారి మాత్రం మొదటి రోజు రామ్‌ చరణ్‌ వచ్చిన తర్వాత గెస్ట్‌ లు ఎవరు లేరు. మూడు వారాలు ముగిశాయి అయినా కూడా గెస్టులు ఎవరు లేకపోవడంతో ఈ సీజన్ కు ఇదే పెద్ద లోటు అన్నట్లుగా షో అభిమానులు కామెంట్స్ చేస్తూ వచ్చారు.

అభిమానులు మరియు ప్రేక్షకులు కోరుకున్న గెస్ట్‌ లు ఎట్టకేలకు రాబోతున్నారు. డబుల్‌ ధమాకా అన్నట్లుగా ఒకేసారి ఇద్దరు దర్శక దిగ్గజాలు అది కూడా చరణ్‌ తో వర్క్ చేసిన వారు రావడంతో అంతా కూడా ఫుల్‌ ఖుషి అవుతున్నారు. వారే టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కాగా మరొకరు కొరటాల శివ. వీరిద్దరు కూడా అపజయం లేకుండా దూసుకు పోతున్న టాలీవుడ్ దర్శకులు. అలాంటి టాలీవుడ్ దర్శకులు ఎన్టీఆర్‌ ముందు ఎవరు మీలో కోటీశ్వరులు షో కు కూర్చోవడం కన్నుల వింధుగా ఉంది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దర్శకులు అయిన కొరటాల మరియు రాజమౌళిలు షో లో కూడా ఎన్టీఆర్ ను డైరెక్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా ఎన్టీఆర్‌ సరదాగా ఇక్కడ అంతా నాది.. నేను చెప్పినట్లుగా వినాలంటూ వ్యాఖ్యలు చేశాడు.

ఇద్దరు కూడా చాలా స్పీడ్ గా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లుగా కూడా ప్రోమోలో చూపించారు. ఈ ఇద్దరు దర్శకులు కనిపించడం వల్ల ఖచ్చితంగా వచ్చే వారం రేటింగ్‌ దుమ్ము లేచి పోవడం ఖాయం అంటున్నారు. ఎన్టీఆర్‌ కు ఈ ఇద్దరు కూడా చాలా ఆప్తులు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎన్టీఆర్‌ సూపర్‌ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఆర్ ఆర్‌ ఆర్‌ తో పాన్ ఇండియా స్టార్‌ గా ఎన్టీఆర్‌ ను మార్చేందుకు జక్కన్న సిద్దం అయ్యాడు. ఇక ఎన్టీఆర్‌ తో జనతా గ్యారేజ్ సినిమాను చేసిన దర్శకుడు కొరటాల శివ మళ్లీ ఎన్టీఆర్ 30 ను చేసేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వీరిద్దరు కూడా ఎన్టీఆర్‌ కెరీర్ లో అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో షో కు అలా అలా సాగుతున్న సమయంలో వీరి ఎంట్రీ వల్ల ఖచ్చితంగా బూస్ట్‌ దక్కుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.