Begin typing your search above and press return to search.

యువ హీరో ట్రాక్ లోకి వచ్చినట్లేనా..!

By:  Tupaki Desk   |   4 Nov 2020 2:30 AM
యువ హీరో ట్రాక్ లోకి వచ్చినట్లేనా..!
X
'ఉయ్యాలా జంపాల' చిత్రంతో వెండితెరకు పరిచయమైన యువ హీరో రాజ్ తరుణ్.. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాడు. దీంతో వరుస ఆఫర్స్ యువ హీరో తలుపుతట్టాయి. ఈ క్రమంలో 'సినిమా చూపిస్తా మామ' 'కుమారి 21F' వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ ని వరుస పరాజయాలు పలకరించాయి. ఎన్ని సినిమాలు చేసినా హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. ఈ నేపథ్యంలో 'గుండజారి గల్లంతయ్యిందే' ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో 'ఒరేయ్ బుజ్జిగా' చిత్రంలో నటించాడు. ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించారు. మాళవిక అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించింది. థియేటర్స్ మూతబడి ఉండటంతో ఈ చిత్రాన్ని తెలుగు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' లో రిలీజ్ చేశారు.

ఓటీటీలో విడుదలైన 'ఒరేయ్ బుజ్జిగా' సినిమా ముందు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా 'ఆహా' ప్ర‌మోష‌న్స్ తో నెమ్మదిగా హిట్ దిశగా పయనించింది. దీంతో ఇప్పుడు రాజ్ త‌రుణ్ మీద కొంద‌రు నిర్మాత‌లు హోప్స్ పెట్టుకుని పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు వ‌స్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో యువ హీరో ఇప్ప‌టికే మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ముందుగా 'ఒరేయ్ బుజ్జిగా' సినిమాని డైరెక్ట్ చేసిన విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అలానే డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందనున్న చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో స్టార్ట్ చేసాడు. రాజ్ త‌రుణ్ కెరీర్లో 15వ చిత్రంగా రానున్న ఈ మూవీకి సాంటో(మోహన్ వీరంకి) దర్శకత్వం వహించనున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించనుంది. వీటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రాజ్ త‌రుణ్ ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయట. మరి ఈ సినిమాలతో హిట్స్ అందుకుని రాజ్ తరుణ్ మళ్ళీ ఫార్మ్ ని కొనసాగిస్తాడేమో చూడాలి.