Begin typing your search above and press return to search.

'పుష్ప' షూటింగ్ స్పాట్ కేరళ నుంచి అక్కడికి మారిందా...?

By:  Tupaki Desk   |   12 Oct 2020 11:30 AM GMT
పుష్ప షూటింగ్ స్పాట్ కేరళ నుంచి అక్కడికి మారిందా...?
X
సుకుమార్‌ - అల్లు అర్జున్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం అడవుల్లో జరుపుకోవాల్సి ఉంది. దీని కోసం కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా కుదరలేదు. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 'పుష్ప' కూడా త్వరలోనే సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తోంది.

'పుష్ప' షూటింగ్ తిరిగి కేరళలోనే స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంది. అయితే కేరళలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు రాజమండ్రి దగ్గరలోని మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏరియాలో రిసార్ట్స్ కూడా బుక్ చేసుకున్నారని సమాచారం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయడం కోసం మొత్తం తారాగణం మరియు సిబ్బంది షెడ్యూల్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా రిసార్ట్‌ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం 'లవ్ స్టోరీ' 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ జరుగుతున్నట్లుగానే 'పుష్ప' చిత్రీకరణ కూడా జరగనుందని తెలుస్తోంది.

కాగా, 'పుష్ప' లో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు కుర్రాడిగా లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.