Begin typing your search above and press return to search.

జగన్‌ కళ్లలో గర్వం కాకుండా కన్నీళ్లు కన్పించాయి : పూరి

By:  Tupaki Desk   |   26 May 2019 10:28 AM GMT
జగన్‌ కళ్లలో గర్వం కాకుండా కన్నీళ్లు కన్పించాయి : పూరి
X
ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ గెలుపుపై టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుండి కూడా జగన్‌ అంటే అభిమానం చూపించే పూరి జగన్నాధ్‌ తాజాగా ఎన్నికల ఫలితాల తర్వాత జగన్‌ పై ప్రశంసలు కురిపిస్తూ, ఎన్నికల్లో ఆయన గెలుపు గురించి గొప్పగా కామెంట్స్‌ చేయడం జరిగింది. జనాలు జగన్‌ ను దేవుడు అని నమ్మి జై కొట్టి ఓటేశారంటూ ఈ సందర్బంగా పూరి పేర్కొన్నాడు.

ఇంకా పూరి మాట్లాడుతూ... ఫలితాల రోజు వైకాపా గెలుపు తర్వాత జగన్‌ మీడియాతో మాట్లాడటం టీవీలో చూశాను. జగన్‌ మొహంలో విజయ గర్వం ఏమాత్రం కనిపించలేదు.. ఇంతటి ఘన విజయం సాధించాను అనే పొగరు ఆయన కళ్లలో కనిపించలేదు. గర్వం కాకుండా ఆయన కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. ఆయనకు గతంలో తగిలిన వెన్ను పోటు కనిపించాయి.. ఆయన ఒంటరిగా ఎన్నో సార్లు ఏడ్చిన సందర్బాలు కనిపించాయి.. ఆయన ఇంటి మహిళలు పెట్టుకున్న కన్నీరు కనిపించాయి.

ఈ విజయంతో జగన్‌ తాను రాజన్న కొడుకునని నిరూపించుకున్నాడు. జగన్‌ ఒక యోధుడు.. గెలుపు కోసం ఎంతగా ప్రయత్నించాలో అంతకు మించి ప్రయత్నించాడు. ఎన్నికల్లో దైవ నిర్ణయం కంటే ప్రజా నిర్ణయంను నేను నమ్ముతాను. ప్రజలను దేవుడు మార్చడంలో విఫలం అయ్యాడు. కాని ఈ ఎన్నికల్లో ప్రజలే దేవుడిని మార్చేశారు. ఇన్ని కోట్ల మంది చేతులు ఎత్తి దండి పెడితే జగన్‌ దేవుడు కాక మరేం అవుతాడు అంటూ పూరి ఎమోషనల్‌ గా స్పందించాడు. జగన్‌ పై పూరి కామెంట్స్‌ కు వైకాపా అభిమానులు ఫిధా అవుతున్నారు.