Begin typing your search above and press return to search.

భైరవ‌ద్వీపం నిర్మాత ఇక లేరు

By:  Tupaki Desk   |   13 May 2019 9:30 PM IST
భైరవ‌ద్వీపం నిర్మాత ఇక లేరు
X
`విజ‌య‌వాహిని అధినేత‌`.. సీనియ‌ర్ నిర్మాత‌ బి.వెంకట్రామిరెడ్డి (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. వెంకట్రామిరెడ్డికి భార్య భారతిరెడ్డి.. కుమారుడు రాజేష్‌రెడ్డి.. కుమార్తెలు ఆర్యనరెడ్డి.. అర్చనరెడ్డి ఉన్నారు. వెంకట్రామిరెడ్డి అంత్య క్రియలు నేడు చెన్నైలో జరిగాయి.

ప్ర‌ఖ్యాత విజయ వాహిని స్టూడియోస్ బ్యాన‌ర్ లో ఎన్టీఆర్-ఏఎన్నార్- సావిత్రి- భానుమతి వంటి క్లాసిక్ స్టార్స్ ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. నిర్మాత బి.నాగిరెడ్డి ఈ చిత్రాల్ని నిర్మించారు. ఆయన చిన్న కుమారుడే ఈ వెంకట్రామిరెడ్డి. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ విజయ బ్యానర్‌పై ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని నిర్మించారు. తెలుగులో శ్రీకృష్ణార్జున విజయం.. బృందావనం.. చిత్రాల్ని నిర్మించారు. బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా సింగీతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `భైరవ ద్వీపం` వంటి భారీ చిత్రాన్ని వెంకట్రామిరెడ్డి నిర్మించారు. తమిళంలో త‌ళా అజిత్ .. ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజయ్.. ధనుష్.. విశాల్ వంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేశారు.

బి.నాగిరెడ్డి - వెంక‌ట్రామిరెడ్డిల సంస్థానం ఎంద‌రికో స్ఫూర్తి. న‌వ‌త‌రాన్ని ప్రోత్స‌హిస్తూ ఆద‌ర్శంగా నిలిచారు. ప‌రిశ్ర‌మ‌లో ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయ‌న త‌న‌యుడు వెంక‌ట్రెడ్డి అందిస్తున్నారు. అంత గొప్ప మ‌న‌సున్న నిర్మాతను కోల్పోవడంతో ఇటు టాలీవుడ్, తో పాటు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకట్రామిరెడ్డి మృతి పట్ల తెలుగు సినిమా రంగం తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.