Begin typing your search above and press return to search.

కొత్త రైటర్ కుమ్మేశాడే..

By:  Tupaki Desk   |   14 Aug 2015 12:16 PM GMT
కొత్త రైటర్ కుమ్మేశాడే..
X
తెలుగు సినిమా మారుతోంది. కథలు మారుతున్నాయి. మాటలు మారుతున్నాయి. ఆ మధ్య ‘ఆగడు’లో జనాల మీద పంచ్ డైలాగుల ప్రభావం గురించి ఏదో డైలాగు చెప్పాడు మహేష్. కానీ జనాల మీద ఇప్పుడు పంచ్ డైలాగుల ప్రభావం బాగా తగ్గిపోయిందని ఇప్పుడిప్పుడే రచయితలకు అర్థమవుతున్నట్లుంది. పంచ్ డైలాగుల ప్రభావం జనాల కంటే రైటర్ల మీద ఎక్కువైపోయి మరీ అన్యాయంగా డైలాగుల కోసం సన్నివేశాల్ని సృష్టించే పరిస్థితి ఏర్పడింది ఓ టైంలో. కానీ నెమ్మదిగా ఆ ప్రభావం నుంచి బయటపడుతున్నారు రచయితలు. సన్నివేశాలకు తగ్గట్లు మాటలు రాసే కొత్త రచయితలకే తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ తరానికి దేవా కట్టా, కొరటాల శివ, సాయిమాధవ్ బుర్రా లాంటి వాళ్ల మాటలే బాగా ఎక్కుతున్నాయి.

తాజాగా ‘సినిమా చూపిస్త మావ’ సినిమాతో మరో మంచి రైటర్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఇంతకుముందు ఏవైనా చిన్న సినిమాలకు పని చేశాడో ఏమ కానీ.. ఈ సినిమాతో ప్రసన్న కుమార్ మంచి పేరే సంపాదించాడు. సినిమాలో మాటల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారంటే అతడి ముద్ర బాగానే పడినట్లే. ‘అరచేతిలో రేఖేసుకుని పుడితే.. అమ్మాయిలు కేకేసి పిలుస్తారు’ లాంటి ఫన్నీ డైలాగులు ఎంత ఆకట్టుకున్నాయో.. ‘‘గెలిచినోడి గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఓడినోడు కారణాల గురించి మాట్లాడతాడు’’ లాంటి సీరియస్ డైలాగులు అంతే మెప్పించాయి సినిమాలు. ఇంకా ఏరుకోదగ్గ ముత్యాలు చాలానే ఉన్నాయి సినిమాలో. ఎక్కడా కూడా అతి మాటలు రాయకుండా సన్నివేశాలకు తగ్గట్లుగా మంచి మాటలు రాశాడు ప్రసన్నకుమార్. సినిమా చూసిన వాళ్లంతా ఈ రైటర్ కు మంచి భవిష్యత్తుందని చర్చించుకుంటున్నారు. మున్ముందు ప్రసన్నకుమార్ మంచి అవకాశాలు అందుకుంటాడేమో.