Begin typing your search above and press return to search.

#Prabhas25: ప్రభాస్ - సందీప్ వంగా కాంబోలో పాన్ ఇండియా 'స్పిరిట్'

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:32 AM GMT
#Prabhas25: ప్రభాస్ - సందీప్ వంగా కాంబోలో పాన్ ఇండియా స్పిరిట్
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ సిల్వర్ జూబ్లీ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం డార్లింగ్ అభిమానులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ముందుగా చెప్పినట్లుగానే ఈరోజు గురువారం ఉదయం #Prabhas25 అఫీషియల్ అనౌన్స్‌ మెంట్ వచ్చేసింది. ప్రభాస్ తన 25వ చిత్రాన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అంతేకాదు దీనికి ''స్పిరిట్'' అనే ఆసక్తికరమైన టైటిల్ ను కూడా ఖరారు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రకటన దర్శక నిర్మాతల నుంచి విడుదలైంది.

'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి వంగా.. తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్ తో 'యానిమల్' అనే మూవీ చేయనున్నారు. అయితే ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ''స్పిరిట్'' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు.

'స్పిరిట్' సినిమాలో ఇప్పటి వరకు ప్రభాస్‌ ను అభిమానులు కనీసం ఊహించనటువంటి సరికొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారని చిత్ర బృందం తెలిపారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో భారీ బడ్జెట్‌ తో ఈ సినిమా రూపొందనుంది. యూవీ క్రియేషన్స్ వారు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ తో 'మిర్చి' 'సాహో' వంటి సినిమాలు నిర్మించిన యూవీ క్రియేషన్స్.. ప్రస్తుతం 'రాధే శ్యామ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సాహో' 'రాధే శ్యామ్' లకు టి-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు #Prabhas25 సినిమాని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి సిరీస్‌ - యూవీ టీమ్ - సందీప్ వంగా కు చెందిన భద్రకాళి పిక్చర్స్ కలిసి సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. భూషణ్ కుమార్ - వంశీ - ప్రమోద్ - వంగా ప్రణయ్ రెడ్డి దీనికి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'రాధే శ్యామ్' చిత్రంతో పాటుగా 'ఆదిపురుష్' 'సలార్' 'ప్రాజెక్ట్ K' సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సందీప్ రెడ్డి - ప్రభాస్ సినిమా సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.