Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ ఇవ్వబోతున్న మరో షాక్‌ కు ఫ్యాన్స్‌ రెడీనా?

By:  Tupaki Desk   |   31 Aug 2020 12:30 PM IST
ప్రభాస్‌ ఇవ్వబోతున్న మరో షాక్‌ కు ఫ్యాన్స్‌ రెడీనా?
X
ఒక వైపు 'రాధేశ్యామ్‌' సినిమా చేస్తున్న ప్రభాస్‌ మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఒక భారీ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దీపిక పదుకునే హీరోయిన్‌ గా నటించబోతుంది అంటూ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. నాగ్‌ అశ్విన్‌ మూవీ పట్టాలెక్కక ముందే అప్పుడే ఓం రౌత్‌ మూవీ 'ఆది పురుష్‌' ను ప్రభాస్‌ ప్రకటించి షాక్‌ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు ఒకే సారి ప్రభాస్‌ ఎలా చేస్తాడు అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆదిపురుష్‌ సినిమా ప్రకటతో ఇచ్చిన షాక్‌ నుండే ఇంకా అభిమానులు బయటకు రాలేదు. ఈ ప్రాజెక్ట్‌ నిజమేనా అన్నట్లుగా అనుమానంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్‌ మరో సూపర్ అనౌన్స్‌ మెంట్‌ ను చేసేందుకు సిద్దం అయ్యాడట. ప్రముఖ తమిళ స్టార్‌ డైరెక్టర్‌ తో ప్రభాస్‌ ఒక సినిమా చేయబోతున్నాడట. ఆ సినిమాను వచ్చే ఏడాది చివర్లో ప్రారంభించి 2023 వరకు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. ఆ సినిమాను ఒకటి రెండు నెలల్లో ప్రభాస్‌ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

బాహుబలి.. సాహో ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్‌ సినిమాల కోసం ప్రభాస్‌ చాలా ఎక్కువ సమయం తీసుకున్నాడు. గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ మూడు సినిమాలనే చేస్తున్నాడు. అందుకే ఇకపై ప్రాజెక్ట్‌ లను ఆలస్యం చేయవద్దనే ఉద్దేశ్యంతో సినిమాలను బ్యాక్‌ టు బ్యాక్‌ అనౌన్స్‌ చేస్తున్నాడు. ఇదే సమయంలో చిన్నా చితకా సినిమాలు కాకుండా భారీ సినిమాలను ఆయన చేస్తున్నాడు.

ఈసారి తమిళ దర్శకుడితో ప్రకటించబోతున్న మూవీ కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ మూవీ అది కూడా దాదాపు 200 కోట్ల బడ్జెట్‌ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ నోటి నుండి ఆ ప్రకటన వస్తుందని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రభాస్‌ ఇవ్వబోతున్న ఈ మరో షాక్‌ కు ఫ్యాన్స్‌ రెడీగా ఉండాలంటున్నారు.