Begin typing your search above and press return to search.

#క‌రోనా విరాళం: పాన్ ఇండియా స్టార్ అనిపించాడు

By:  Tupaki Desk   |   27 March 2020 5:50 AM GMT
#క‌రోనా విరాళం: పాన్ ఇండియా స్టార్ అనిపించాడు
X
క‌రోనా మ‌హ‌మ్మారీ చాప చుట్టేస్తోంది. మార్కెట్ల‌పై కంప‌లు వేసేసింది. కుటుంబాల్లో కుంప‌ట్లు పెట్టేస్తోంది. భ‌విష్య‌త్ అంధఃకారంగా మార్చేస్తోంది. రోజురోజుకు కొవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఇండియా బిక్కు బిక్కుమంటోంది. అమెరికా మార్కెట్ల‌తో ముడిప‌డిన ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ అత‌లాకుత‌లం అవుతోంది.

ప్ర‌స్తుత ఎమ‌ర్జెన్సీ స‌న్నివేశం అర్థ‌మై ఫిలింస్టార్లు అంతా ఒక్కొక్క‌రుగా త‌మ డొనేష‌న్ల‌ను ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. డొనేష‌న్లు ప్ర‌క‌టించ‌డంలో తొలిగా ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ లాంటి సౌత్ స్టార్లు వేగంగా స్పందించారు. ఆ త‌ర్వాత టాలీవుడ్ లో డ‌జ‌ను మంది స్టార్లు భారీ విరాళాల్ని ప్ర‌క‌టించి ఆప‌త్కాలంలో తాము ఉన్నామ‌ని నిరూపించారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సైతం భారీ విరాళం ప్ర‌క‌టించారు. ఆయ‌న ఇరు తెలుగు రాష్ట్రాల‌కు త‌లో 50ల‌క్ష‌ల చొప్పున విరాళం ప్ర‌క‌టించ‌డ‌మే గాక‌.. కేంద్రానికి 3 కోట్లు డొనేట్ చేశాడు. పీఎం రిలీఫ్ ఫండ్ కి ఇది చేరుతుంద‌ని వెల్ల‌డించాడు.

4 కోట్ల సాయం అంటే చిన్న‌దేమీ కాదు. అదీ పాన్ ఇండియా రేంజ్ డొనేష‌న్ అనే చెప్పాలి. బాహుబ‌లి స్టార్ గా త‌న ఇమేజ్ ని పెంచిన డొనేష‌న్ ఇది. ఇక ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న జాన్ (ప్ర‌భాస్ 20) షూటింగ్ పెండింగ్ లో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ స‌హా చిత్ర‌బృందం ఇటీవ‌ల జార్జియా నుంచి ఇండియాకి తిరిగి వ‌చ్చేసింది. ప్ర‌భాస్ అండ్ టీమ్ స్వీయ‌నిర్భంధంలోకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే పవన్ కళ్యాణ్- రామ్ చరణ్- చిరంజీవి- మహేష్ సైతం కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటాన్ని పెంచడానికి విరాళం ఇచ్చారు. దీనికోసం ప‌వ‌న్ 2కోట్లు.. చ‌ర‌ణ్ 70ల‌క్ష‌లు ప్ర‌క‌టించ‌గా.. మెగాస్టార్ చిరంజీవి కోటి విరాళం ప్ర‌క‌టించారు. సూపర్ స్టార్ మహేష్ కోటి విరాళం ప్ర‌క‌టించ‌గా.. ప‌లువురు స్టార్లు ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ప్ర‌క‌టించిన సంగ‌తి విదిత‌మే.