Begin typing your search above and press return to search.

వెండితెర‌పై యువ‌నేత‌ సాహ‌సాల క‌థ‌!

By:  Tupaki Desk   |   18 Jan 2019 9:37 AM IST
వెండితెర‌పై యువ‌నేత‌ సాహ‌సాల క‌థ‌!
X
గ‌త కొంత‌కాలంగా బ‌యోపిక్‌ ల హ‌వా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ - వైయ‌స్సార్ బ‌యోపిక్ - థాక్రే బ‌యోపిక్ - మోదీ బ‌యోపిక్.. ఇలా ఎన్నో బయోపిక్ లు వేడి పెంచుతున్నాయి. ఆ కోవ‌లోనే మ‌రో నాయ‌కుడిపై సెమీ (పూర్తి జీవిత‌క‌థ కాదు) బ‌యోపిక్ సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌న్న వార్త వేడి పెంచుతోంది. ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క నాయ‌కుడైన ఆ యువ‌నేతపైనే సినిమా అన‌గానే ఒక్క‌సారిగా యూత్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.

రైట‌ర్‌ గా 40 చిత్రాలు..న‌టుడిగా ఇప్ప‌టి వ‌ర‌కు 127 చిత్రాలు - ద‌ర్శ‌కుడిగా మూడు చిత్రాలు మాత్ర‌మే చేసిన పోసాని కృష్ణ‌ముర‌ళి `మెంట‌ల్ కృష్ణ‌` త‌రువాత మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు. ఇటీవ‌ల సైలెంట్‌ గా క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్టారాయ‌న‌. ఇది యువ‌నాయ‌కుడు - వైయ‌స్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ డేరింగ్ స్టోరీ నేప‌థ్యంలో వుంటుంద‌ని ప్ర‌చారం జోరందుకుంది. గ‌త కొంత కాలంగా పోసాని కృష్ణ ముర‌ళి వైసీపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తూ చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్‌ పై త‌న‌కున్న భ‌క్తిని చాటుకోవ‌డానికి ఎన్నిక‌ల వేళ‌ ఆయ‌న సినిమా చేస్తున్నార‌ని అంతా అంటున్నారు.

అందుకు త‌గ్గ‌ట్లే పులివెందుల‌లో చిత్ర బృందంతో హంగామా చేసిన పోసాని కొత్త చిత్రాన్ని జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలోనే మొద‌లు పెట్ట‌డం ప‌లు సందేహాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ లోని పోరాట ప‌టిమ‌ను ఎలివేట్ చేసేలా ఈ సినిమా ఉంటుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా షూటింగ్ కి లొకేష‌న్ల ఎంపిక పూర్త‌యింది. 20 రోజుల పాటు పులివెందుల చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నార‌ని తెలుస్తోంది. లొకేష‌న్‌ ల ప‌రిశీల‌నకు వెళ్లిన పోసాని వెంట వైసీపీ నేత‌లు వెల్ల‌డం టీడీపీ వ‌ర్గాల‌కు ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌న్న మాటా వినిపిస్తోంది. గొల్డెన్ ఎర ప్రొడ‌క్ష‌న్ నెం.1 బ్యాన‌ర్‌ పై శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోసాని జ‌గన్‌ పై తీయ‌బోతున్న సినిమా ఏపీ రాజ‌కీయాలను ప్ర‌భావితం చేస్తుందా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.