Begin typing your search above and press return to search.

ఆ బ్లాక్ బస్టర్లో అతను చేయాల్సిందట

By:  Tupaki Desk   |   18 Nov 2018 11:00 PM IST
ఆ బ్లాక్ బస్టర్లో అతను చేయాల్సిందట
X
అక్కినేని నాగార్జున-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘సూపర్’ సినిమాలో మామా మామా అంటూ వెరైటీగా విలనిజం చేసిన బాలీవుడ్ నటుడు గుర్తున్నాడా? అతడి పేరు పియూష్ మిశ్రా. బాలీవుడ్లో అతడికి మంచి పేరే ఉంది. అక్కడ మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న పియూష్.. ఒకప్పుడు హీరోగా కూడా ప్రయత్నించాడు. అతడికి బాలీవుడ్ ఆల్ టైం హిట్లలో ఒకటైన ‘మైనే ప్యార్ కియా’లో హీరోగా నటించే అవకాశం వచ్చిందట. సల్మాన్ ఖాన్‌ కు లైఫ్ ఇచ్చిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత అతను పెద్ద స్టార్ అయిపోయాడు. అలాంటి సినిమాకు దర్శకుడు సూరజ్ ఆర్.బర్జాత్యా ముందు హీరోగా అడిగింది పియూష్ మిశ్రానేనట. ఐతే పియూష్ అందుకు ఒప్పుకోలేదట. ఆ సినిమాను తాను ఎందుకు వద్దన్నానో తనకే తెలియదని చెప్పాడు పియూష్.

‘‘మైనే ప్యార్‌ కియా సినిమాలో నటించనని ఎందుకు చెప్పానో నాకే తెలియదు. ఆ సినిమా సినిమాలో కథానాయికగా భాగ్యశ్రీని అప్పటికీ ఎంచుకున్నారు. కథానాయకుడి కోసం చూస్తున్నారు. ఈ సినిమాతో నన్ను ప్రేక్షకులకు పరిచయం చేయాలని దర్శకుడు సూరజ్ బర్జాత్యా అనుకున్నారు. అప్పట్లో నేను అందంగా ఉండేవాడిని. ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నానో నాకే తెలియదు. నేను నటించకపోవడానికి కారణం ఇదేనంటూ చాలా వదంతులు వచ్చాయి. అవి నిజం కాదు. ప్రేమ్‌ పాత్రను వద్దు అనుకున్నందుకు నేనెప్పుడూ బాధపడలేదు. అందులో నేను చేసుంటే ఎలా ఉండేది? అని ఊహించుకోనూ లేదు’’ అని పియూష్ చెప్పాడు. ఒకవేళ పియూషే ప్రేమ్ పాత్రలో నటించి ఉంటే.. ఇప్పుడు అతడిని అందరూ ఒక స్టార్ లాగా చూస్తుండేవాళ్లేమో. మరి ఆ సినిమా చేయకుంటే సల్మాన్ ఇప్పుడున్న స్థాయిలో ఉండేవాడా?