Begin typing your search above and press return to search.

లైంగిక వేధింపుల కేసులో దర్శకుడికి సమన్లు జారీ...!

By:  Tupaki Desk   |   30 Sept 2020 4:20 PM IST
లైంగిక వేధింపుల కేసులో దర్శకుడికి సమన్లు జారీ...!
X
బాలీవుడ్‌ దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ పై హీరోయిన్ పాయల్‌ ఘోష్‌ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనతో అనురాగ్‌ కశ్యప్‌ అసభ్యంగా ప్రవర్తించాడని.. తనని బలవంతం చేయబోయాడని పాయల్‌ ఘోష్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ కు ముంబైలోని వెర్సోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్‌ లో హాజరు కావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌ లో పాయల్ ఘోష్ అనురాగ్‌ పై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. అనురాగ్‌ కశ్యప్‌ పై ఐపీసీ సెక్షన్లు 376 (ఐ) (అత్యాచారం), 354 (మహిళపై దాడి లేదా క్రిమినల్ ఫోర్స్), 341 (తప్పుడు సంయమనం) మరియు 342 (నిర్బంధం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. దీంతో పాటు రసాయన పదార్థాలను వినియోగించినందుకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అనురాగ్ కశ్యప్‌ పై పాయల్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఈ కేసుపై త్వరగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ తనకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తానని పేర్కొంది. అంతేకాకుండా తనకు న్యాయం చేయాలని.. తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించమని పాయల్‌ ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. కేంద్రమంత్రి రామ్‌ దాస్ అథవాలే ఆమెకు మద్దతు తెలిపారు. ఇదే క్రమంలో నిన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేసింది పాయల్. ఈ నేపథ్యంలో అనురాగ్‌ ని సమన్లు జారీ చేశారు. ఏడేళ్ల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై రేపు అనురాగ్ కశ్యప్‌ ను పోలీసులు విచారించనున్నారు.