Begin typing your search above and press return to search.

మల్టీ స్టారర్ కి పవన్ ఆసక్తి చూపట్లేదా!..స్క్రిప్ట్ మారుతున్న 'ఏకే ' రీమేక్

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:45 AM IST
మల్టీ స్టారర్ కి పవన్ ఆసక్తి చూపట్లేదా!..స్క్రిప్ట్ మారుతున్న ఏకే  రీమేక్
X
పాలిటిక్స్ కు కాస్త విరామం ఇచ్చి పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ని దాదాపు పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు యువ దర్శకుడు సాగర్ చంద్ర కు అప్పగించారు. మల్టీస్టారర్ అయిన ఈ సినిమా కోసం మరో హీరోను ఎంపిక చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ బయటకు వచ్చింది. అయ్యప్పనుమ్ కోషియమ్ కథలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సమాచారం. పవన్ కళ్యాణ్ మరో హీరోతో జట్టుకట్టి సినిమా చేసే ఉద్దేశంలో లేరని అందుకే ఆయన సూచనల మేరకు మాతృకలో మార్పులు-చేర్పులు చేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ మల్టీస్టారర్ మూవీ. మాతృకలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్, బిజు మేనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ కథా రీత్యా ఇద్దరు హీరోలు కావాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ కు ఉన్న సూపర్ స్టార్డం వల్ల ఆయన ఒక హీరోగా, మరో పాత్రలో ఇంకో హీరోకి సమ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ డం వల్ల ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా ఆయన చూడటానికి అభిమానులు అంగీకరించక పోవచ్చని అంటున్నారు. పవన్ కూడా మల్టీ స్టారర్ కి అంత ఆసక్తి చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒక బలమైన శత్రువుతో పోరాటం చేసే యాక్షన్ ప్యాక్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే వలసిందిగా పవన్ దర్శకుడు సాగర్ చంద్రకు సూచనలు చేశారని.. అందుకు అనుగుణంగా సాగర్ స్క్రిప్ట్ ను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మాతృకలో బిజు మేనన్ చేసిన అయ్యప్ప పాత్రను పవన్ చేస్తుండగా.. పృథ్వీ రాజ్ చేసిన కోషి పాత్రను పూర్తిగా మార్చే అవకాశం ఉంది.ఈ పాత్ర కోసం మరొక నటున్ని ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో కూడా హిందీ లో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ ను పవన్ కళ్యాణ్ కథ మార్చి గబ్బర్ సింగ్ సినిమా చేయగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ కథకు అయ్యప్పనుమ్ కోషియమ్ కు పూర్తిగా తేడా ఉండడంతో ఎలా ఉంటుంది అనే దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.