Begin typing your search above and press return to search.

మహేష్ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రావడం లేదే..?

By:  Tupaki Desk   |   22 Sep 2022 4:11 AM GMT
మహేష్ దర్శకుడి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ రావడం లేదే..?
X
'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో వర్క్ చేసే అవకాశం అందుకున్నాడు డైరెక్టర్ పరశురామ్. 'సర్కారు వారి పాట' అనే మంచి టైటిల్ తో సినిమా చేశారు. సమ్మర్ సీజన్ లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ళు రాబట్టింది. అయితే దీని వెనుక మహేశ్ స్టార్ డమ్ - స్టామినా తప్ప.. దర్శకుడి ప్రతిభ ఏం లేదని కామెంట్స్ వచ్చాయి.

వాస్తవానికి మహేష్ తో పరశురాం సినిమా అనౌన్స్ చేసినప్పుడే.. అప్పటి వరకూ చిన్న మీడియం రేంజ్ హీరోలతోనే పని చేసిన దర్శకుడు.. అగ్ర హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడో అని అందరూ ఆలోచించారు. సినిమా చూసిన తర్వాత.. 'సర్కారు వారి పాట' పాయింట్ బాగానే ఉన్నా.. సూపర్ స్టార్ ని డీల్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడని విమర్శకులు అభిప్రాయ పడ్డారు.

మహేష్ ఫ్యాన్స్ సైతం తమ హీరోని కొత్తగా ప్రెజెంట్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారని.. ఆయన స్థాయికి తగ్గ సినిమా తీయలేదని కామెంట్స్ చేశారు. ఎంత వసూలు చేసింది.. హిట్టా ప్లాపా అనేది పక్కన పెడితే.. ఓవరాల్ గా సర్కారు వారి విషయంలో అభిమానులు నిరాశ చెందారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరశురాం ఈసారి ఎలాంటి సినిమా చేస్తారు? ఏ హీరోతో కలిసి వస్తారనే ఆసక్తి ఏర్పడింది.

SVP విడుదలై నాలుగున్నర నెలలు గడిచినా పరశురాం తదుపరి ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే యవసామ్రాట్ నాగచైతన్య తో ఓ సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు పలు ఇంటర్వ్యూలలో చెబుతూ వచ్చారు. ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండే అవకాశం ఉందని టాక్ వచ్చింది. కానీ ఇంతవరకూ దీనిపై స్పష్టత రాలేదు.

నిజానికి సర్కారు వారి పాట కంటే ముందే నాగచైతన్య తో పరశురాం సినిమా చేయాల్సింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. 'నాగేశ్వరరావు' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే దర్శకుడికి మహేశ్ బాబు నుంచి పిలుపు రావడంతో.. చైతూ సినిమాని హోల్డ్ లో పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పరశురాం చిత్రాన్ని చై హోల్డ్ లో పెట్టినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

ఇటీవల 'థాంక్యూ' సినిమాతో నిరాశ పరిచిన చైతన్య.. లేటెస్టుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ ద్విభాషా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. రామోజీ ఫిలిం సిటీలో నిన్న బుధవారం నుంచి NC22 షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో చైతూ ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అయితే నాగచైతన్య తన తర్వాతి చిత్రాన్ని పరశురాం తోనే చేస్తారని భావిస్తుండగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. తాను ఇప్పుడు మసాలా సినిమాలు చేయలేనని.. ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్ తో రావాలని చై చెప్పినట్లు పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో చైతూ - పరశురాం ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా అని అభిమానులు సందిగ్ధంలో పడిపోయారు. అలానే పరశురాం నెక్స్ట్ మూవీ ఏంటనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. మరి త్వరలోనే దర్శకుడు తన తదుపరి సినిమాని అనౌన్స్ చేసి అన్నిటికీ చెక్ పెడతాదేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.