Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ గా మారిపోనున్న ఎన్టీఆర్...!

By:  Tupaki Desk   |   8 May 2020 1:00 PM GMT
పాన్ ఇండియా స్టార్ గా మారిపోనున్న ఎన్టీఆర్...!
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్ లలో, డైలాగ్ డెలివరీలో తనకు పోటీ వచ్చే వారే లేరని నిరూపించుకున్నాడు. 'టెంపర్' సినిమా తర్వాత తన పంధా మార్చి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరో అడుగు ముందుకేసాడు. కేవలం సౌత్ లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మార్కెట్ విస్తరించుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఆర్.ఆర్.ఆర్ లో తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు 'కొమరం భీమ్' క్యారెక్టర్ లో తారక్ కనిపించనున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇతర భారతీయ భాషల్లో కూడా భారీగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ తర్వాత తారక్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అప్పుడు టాలీవుడ్ స్టార్ గా కాకుండా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందుతాడు.

ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. తన కెరీర్లో 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ అని సమాచారం. వాస్తవానికి సౌత్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది అగ్ర దర్శకులు తారక్ తో ఒక్క సినిమా అయినా చేయాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే 'కేజీయఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కి ఒక స్టోరీ కూడా చెప్పాడని సమాచారం. ఇది ఓ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుందట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు రెండేళ్లు డేట్స్ కేటాయిస్తున్నారట. వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2023 తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించనున్నాయని సమాచారం. అంతేకాకుండా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా ఎన్టీఆర్ కోసం ఒక స్టోరీ రెడీ చేసాడంట. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ - అట్లీ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా రాబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో తారక్ ఇలా వరుసగా పాన్ ఇండియా మూవీస్ లైన్లో పెడుతూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోబోతున్నాడని చెప్పవచ్చు.