Begin typing your search above and press return to search.

'యన్.టి.ఆర్' ను ఎలా అమ్ముతున్నారబ్బా?

By:  Tupaki Desk   |   5 Oct 2018 10:40 AM IST
యన్.టి.ఆర్ ను ఎలా అమ్ముతున్నారబ్బా?
X
మొత్తానికి నందమూరి తారక రామారావు బయోపిక్ విషయంలో కొన్ని రోజులుగా నడుస్తున్న సందిగ్ధతకు తెరపడింది. ఈ మధ్య ప్రచారం జరుగుతున్నట్లే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. రెండు సినిమాల రిలీజ్ డేట్లు కూడా ఇచ్చేశారు. రెండు వారాల వ్యవధిలో రెండు పార్టులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అంటే ఒక సినిమాకు రెండు టికెట్లు కొనిపించబోతున్నారన్నమాట. ఇది తెలివైన ఎత్తుగడే. దీని వల్ల సినిమా ఆదాయం రెట్టింపు చేసుకునే అవకాశం కలిగింది. కష్టం.. బడ్జెట్ పెరుగుదలతో పోలిస్తే వచ్చే ఆదాయం పెరుగుతోంది. కథ ఒక్కటే అయినా... పూర్తి నిడివితో రెండు సినిమాలు చూస్తారు కాబట్టి ప్రేక్షకులు ఫీలవ్వాల్సిందేమీ లేదు. ఐతే ఈ చిత్రానికి చిత్ర బృందం బిజినెస్ ఎలా చేస్తోందన్నది ఆసక్తికరం.

‘యన్.టి.ఆర్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలన్న నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారన్నది తెలియదు. సినిమా చిత్రీకరణ జరుగుతుండగా.. నిడివి పెరిగేలా ఉండటం చూసి.. ఈ ఎత్తుగడ వేసి ఉండొచ్చు. ఐతే ఈ చిత్ర బిజినెస్ కొన్ని నెలల కిందటే మొదలైంది. ట్రేడ్ వర్గాల నుంచి విపరీతమైన డిమాండ్ రావడంతో కొన్ని ఏరియాలకు హక్కులు అమ్మడం ముందే మొదలుపెట్టేశారు. మామూలుగా బాలయ్య సినిమాలకు జరిగే బిజినెస్‌తో పోలిస్తే చాలా ఎక్కువకే హక్కులు అమ్ముతూ వచ్చారు. ఈ రేట్లు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మరి సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న సమాచారం తెలిసే బయ్యర్లు అంతేసి రేట్లు పెట్టారా? ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చ జరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఒకవేళ ఒక భాగానికే అంతేసి రేటు పెట్టి ఉంటే.. రెండో భాగం ద్వారా బిజినెస్ మరింతగా చేసుకుని భారీ స్థాయిలో లాభాలు అందుకునే అవకాశముంది. తొలి భాగం కొన్నవాళ్లకే రేటు కాస్త చూసుకుని హక్కులు కట్టబెడతారేమో. ఐతే పెట్టే బడ్జెట్‌ తో పోలిస్తే ఆదాయం మూడు రెట్లకు తగ్గే అవకాశమే లేదని ట్రేడ్ వర్గాలంటున్నాయి. మొత్తానికి తన తండ్రి బయోపిక్ తీయడం ద్వారా బాలయ్య భారీగానే ఆదాయం మూటగట్టుకోబోతున్నారన్నమాట.