Begin typing your search above and press return to search.

డ్రగ్ కేసుపై 6 నెలల్లో ఛార్జిషీట్...? సెలబ్రిటీలకు క్లీన్ చీట్ లేనట్లేనా...?

By:  Tupaki Desk   |   28 Sep 2020 3:00 PM GMT
డ్రగ్ కేసుపై 6 నెలల్లో ఛార్జిషీట్...? సెలబ్రిటీలకు క్లీన్ చీట్ లేనట్లేనా...?
X
బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ అధికారులు.. కొందరు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న(ఆదివారం) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిజి రాకేశ్ అస్తానా డ్రగ్స్ కేసుపై రివ్యూ చేయడానికి ఢిల్లీ నుంచి ముంబై వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న అర్థరాత్రి వరకు జరిగిన మీటింగ్ లో డిప్యూటీ డైరెక్టర్ కెపిఎస్ మల్హోత్రా మరియు సమీర్ వాంఖడే సహా ఎన్సీబీ ఉన్నతాధికారులు అందరూ పాల్గొన్నారని నేషనల్ మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి డిజి అస్తానా ఆరు నెలల కాలపరిమితిని ఇచ్చారని.. మాదక ద్రవ్యాల అణిచివేతకు అస్తానా నుంచి ఎన్‌సిబి బృందాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని మీడియా వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కున్న సెలబ్రిటీలలో ఎవరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వలేదని.. ఎన్‌సిబి టీమ్ వారిని పూర్తిగా విచారించడానికి ప్రిపేర్ అయిందని రిపబ్లిక్ టీవీ కథనం ప్రసారం చేసింది.

కాగా, డ్రగ్స్ కేసులో ఇప్పటికే హీరోయిన్ రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడితో పాటు పలువురు డ్రగ్ డీలర్లను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే - శ్రద్ధా కపూర్‌ - రకుల్ ప్రీత్ సింగ్ - సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించారు. వీరితో పాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ - ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా - టాలెంట్ మేనేజర్ జయ సాహాలను కూడా ప్రశ్నించారు. అయితే కొన్ని విషయాలకు వారు చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందని ఎన్‌ సిబి.. వీరిలో కొందరిని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలున్నాయని నేషనల్ మీడియా చెబుతోంది. ఇక డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయని రుజువు కావడంతో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన క్షితిజ్ రవి ప్రసాద్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబై కోర్ట్ అక్టోబర్ 3 వరకు క్షితిజ్ రవిని కస్టడీకి అనుమతినిచ్చింది.