Begin typing your search above and press return to search.

'నాని ఫ్యాన్స్ మీట్' గ్లిమ్స్: 'శ్యామ్ సింగ రాయ్' ఆతిధ్యానికి ఫిదా..!

By:  Tupaki Desk   |   29 Nov 2021 12:12 PM GMT
నాని ఫ్యాన్స్ మీట్ గ్లిమ్స్: శ్యామ్ సింగ రాయ్ ఆతిధ్యానికి ఫిదా..!
X
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులకు మెప్పిస్తూ వస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సెల్ఫ్‌ మేడ్ స్టార్ గా ఎదిగిన నాని.. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో అశేష అభిమానులను సంపాదించుకున్నారు. తన ఫ్యాన్స్ పట్ల ఎంతో శ్ర‌ద్ద చూపించే నాని.. అవకాశం వచ్చినప్పుడల్లా వారిని కలుస్తుంటారు. ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్స్ లో భాగంగా నాని ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు.

హైద‌రాబాద్‌ లోని కన్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. గ్రాండ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియోని ఈరోజు సోషల్ మీడియాలో విడుదల చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇత‌ర రాష్ట్రాల నుంచి 4000 కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ త‌మ ఫేవ‌రేట్ హీరో నాని ని కలిసేందుకు వ‌చ్చారని తెలుస్తోంది. నాని వారిని పేరు పేరునా ప‌లుక‌రిస్తూ యోగ క్షేమాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అందరికీ భోజనం ఏర్పాట్లు చేయించారు.

ఫ్యాన్స్ మీట్ కోసం ఓపికగా ఎంతో సమయం కేటాయించి అక్కడికి వచ్చిన అభిమానులందరితో ఫోటోలు దిగారు. అంతేకాదు వారికి తన ఆటోగ్రాఫ్ తో పాటుగా 'శ్యామ్ సింగ‌రాయ్' ప్రింట్ చేయబడిన కానుకలు అందజేశారు. తమ అభిమాన హీరో పిలిచిమరీ భోజ‌నం పెట్టడంతో పాటుగా గిఫ్ట్స్ అందించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 'శ్యామ్ సింగ రాయ్' సినిమా నాని కి మంచి సక్సెస్ అందించాలని కోరుకుంటున్నారు.

కాగా, నాని హీరోగా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''శ్యామ్ సింగ రాయ్'' క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.

నాని కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. ఇందులో నాని సరసన సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. సత్యదేవ్ జంగా ఈ చిత్రానికి కథ అందించారు.