Begin typing your search above and press return to search.

సౌత్ Vs బాలీవుడ్: జాతీయ భాష వివాదం ఎంత వరకు వెళ్తుందో..?

By:  Tupaki Desk   |   29 April 2022 10:34 AM GMT
సౌత్ Vs బాలీవుడ్: జాతీయ భాష వివాదం ఎంత వరకు వెళ్తుందో..?
X
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో దక్షిణాది ఆధిపత్యం నడుస్తోందని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవల కాలంలో పలు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుంటే.. హిందీ సినిమాలు వరుసగా పరాజయాలు చవిచూస్తున్నాయి.

'బాహుబలి' 'బాహుబలి 2' సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు అదే బాటలో 'పుష్ప' 'ఆర్.ఆర్.ఆర్' 'కేజీఎఫ్ 2' సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఇప్పుడు అందరి చూపు దక్షిణాది చిత్ర పరిశ్రమపైనే ఉంది. ఎక్కడ చూసినా సౌత్ సినిమాలు.. సౌత్ ఇండియా స్టార్స్ గురించే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది.

ఈ క్రమంలోనే సౌత్ సినిమాని చూసి బాలీవుడ్ భయపడుతోందని.. వారికి చెమటలు పడుతున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. భారతీయ సినిమా అంటే సౌత్ ఇండియా సినిమా అనే విధంగా మారడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని.. సౌత్ సక్సెస్ ని చూసి తట్టుకోలేకపోతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్య పలువురు బాలీవుడ్ స్టార్స్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇది నిజమేనేమో అనిపిస్తుంది.

ఇటీవల కన్నడ హీరో సుదీప్ ఓ సినిమా ఈవెంట్ లో సౌత్ సినిమా సక్సెస్ పై చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 'పాన్ ఇండియా అని కాదు.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ అలరించేలా మనం సినిమాలు చేస్తున్నాం. ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు. హిందీ వారే ఇప్పుడు తమ సినిమాలను తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో డబ్ చేస్తున్నారు. అయినా సక్సెస్ సాధించలేకపోతున్నారు' అని సుదీప్ అన్నారు.

ఇకపై హిందీ మన జాతీయ భాష కాదు అని సుదీప్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పందిస్తూ.. హిందీ ఎప్పటికీ జాతీయ భాషే అని ట్వీట్ చేశారు. హిందీ జాతీయ భాష కానప్పుడు మీరెందుకు మీ మాతృభాష సినిమాలను హిందీలో డబ్ చేస్తున్నారు. జాతీయ భాషగా హిందీ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ అదే ఉంటుంది అని అజయ్ పేర్కొన్నారు. దీనికి సుదీప్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

'అజయ్ సార్.. మీకు మరో విధంగా అర్ధమైందనుకుంటా. నేను ఎవరినీ కించపరిచేందుకు అలా అనలేదు. మన దేశ భాషలన్నింటిపైనా నాకు గౌరవం ఉంది. మేం హిందీని గౌరవించాం.. నేర్చుకున్నాం. అందుకే మీరు హిందీలో చేసిన ట్వీట్ ను నేను చదవగలిగాను. అదే నేను ఈ రిప్లై కన్నడలో ఇస్తే పరిస్థితి ఏంటి? అని సుదీప్ ప్రశ్నించారు.

కిచ్చా సుదీప్ - అజయ్ దేవగన్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరి రాజకీయ రంగు పులుముకుంది. సుదీప్ స్టేట్మెంట్ తో తాను ఏకీభవిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం తెలిపారు.

మాతృభాషపై మన వైఖరి స్పష్టంగా ఉంది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైన సమయంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రాంతీయ భాషలు అత్యున్నతమైనవి. వాటిని అందరూ అంగీకరించాలి.. గౌరవించాలి అని కిచ్చా సుదీప్ కూడా చెప్పారు. దానిని అందరూ అర్థం చేసుకోవాలని సీఎం బొమ్మై అన్నారు.

హిందీ బాషా వివాదంపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కు సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే సుదీప్ కు మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి - కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య - కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అండగా నిలిచారు.

విపక్ష నేత సిద్ధరామయ్య ట్విట్టర్ లో అజయ్ దేవగన్ ని ట్యాగ్ చేస్తూ.. హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదని, ఎప్పటికీ ఉండదని అన్నారు. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని.. ప్రతి భాషకు దాని స్వంత చరిత్ర ఉందని.. తాను కన్నడిగుడిని అయినందుకు గర్వపడుతున్నానని సిద్ధ రామయ్య పేర్కొన్నారు.

మన దేశంలోని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ భాషల్లో హిందీ కూడా ఒకటని కుమారస్వామి అన్నారు. భారతదేశం అనేక భాషల ఉద్యానవనం.. వైవిధ్యాన్ని పాడుచేసే ప్రయత్నాలు చేయకూడదని హితవు పలికారు. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భారతీయులందరి భాష కాదని అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, తొమ్మిది కంటే తక్కువ రాష్ట్రాలలో హిందీ రెండవ లేదా మూడవ భాషగా ఉందని.. అలాంటప్పుడు అజయ్ దేవగణ్ ప్రకటనలు ఎంత వరకు వర్తిస్తాయని కుమారస్వామి ప్రశ్నించారు. ఆయన బీజేపీ - హిందీ జాతీయవాదం మౌత్ పీస్ లా మాట్లాడారని ఎద్దేవా చేశారు.

ఇక సుదీప్ - అజయ్ దేవగన్ ట్వీట్ వార్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. ఇప్పుడు దక్షిణాది లేదా ఉత్తరాది అనేవి లేవు.. భారతదేశం మొత్తం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నానని ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రాంతీయత, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలనేవి వృద్ధి చెందాయి. ప్రజలు చేరువ కావడానికి భాష దోహదపడుతుంది. విడదీయడానికి కాదు అని నేను నమ్ముతానని వర్మ అన్నారు.

నార్త్ స్టార్స్ అభద్రతాభావంతో ఉన్నారని.. సౌత్ స్టార్స్ పట్ల అసూయతో ఉన్నారనేది కాదనలేని నిజమని వర్మ పేర్కొన్నారు. ఒక కన్నడ డబ్బింగ్ సినిమా - తెలుగు డబ్బింగ్ చిత్రం.. హిందీలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రాలు మరియు హిందీ పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి ఒరిజినల్ చిత్రాన్ని ఓడించి.. ప్రజలు కంటెంట్ ను ఇష్టపడుతున్నారని.. అది ఎక్కడ నుండి వస్తున్నా పట్టించుకోరని రుజువు చేస్తోందని బాలీవుడ్ షాక్ అవుతోందని రాంగోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశారు.

''కాదనలేని వాస్తవం ఏమిటంటే ప్రభాస్ - యష్ - రామ్ చరణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ బాలీవుడ్ కి వెళ్లి హిందీ స్టార్స్ రణవీర్ సింగ్ - రణబీర్ కపూర్ - అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ - జాన్ అబ్రహం మొదలైన వారిని బ్లాస్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అందరూ తమ హిందీ చిత్రాలను తెలుగు, కన్నడ మొదలైన భాషల్లోకి డబ్ చేసి.. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేసి సౌత్ స్టార్స్ కి సవాల్ విసరాలి'' అని ఆర్జీవీ పేర్కొన్నారు.

సుదీప్ - అజయ్ దేవగన్ ట్వీట్ వార్ పై సోనూసూద్ కూడా స్పందించాడు. భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్టైన్మెంట్. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని ఇవ్వగలిగితే చాలు. వారు నిన్ను ఆదరిస్తారు అని అన్నారు. దక్షిణాది చిత్రాల ప్రభావం భవిష్యత్తులో హిందీ సినిమాలపై ఖచ్చితంగా ఉంటుందని సోనూ అభిప్రాయ పడ్డారు.

ఇకపోతే పలువురు బాలీవుడ్ స్టార్స్ సైతం సౌత్ సినిమాని ప్రశంసిస్తున్నారు. సౌత్ సినిమాల విజయానికి బాలీవుడ్ మేకర్స్ భయపడుతున్నారని.. వారికి వెన్నులో వణుకు పుడుతోందని.. ఏం చేయాలో అంతుపట్టడం లేదని విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయి బాలీవుడ్ కి చురకలు అంటించారు. సౌత్ సినిమాల విజయం బాలీవుడ్‌ కు ఒక పాఠం అని.. ముంబై ఫిల్మ్ మేకర్స్ దీన్నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మనోజ్.

అయితే మరో బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కాస్త భిన్నంగా స్పందించారు. 'పాన్‌ ఇండియా అనే పదంపై నాకు నమ్మకం లేదు. కేజీఎఫ్‌ 2 - పుష్ప - RRR చిత్రాలు హిందీలో మంచి వసూళ్లు సాధించాయి. మంచి సినిమా హిట్‌ అవుతుంది.. లేకుంటే ప్లాప్ ఎక్కడైనా ప్లాప్‌ అవుతుంది. బాలీవుడ్‌ లో మంచి కంటెంట్ సినిమాలు రావట్లేదనడం సరికాదు. గంగుబాయి కతియావాడి - సూర్యవంశీ మంచి హిట్‌ సాధించాయి. ఇండియన్ సినిమాలో ఒక ఏడాది వెయ్యికి పైగా చిత్రాలు వస్తుంటే.. అందులో కేవలం రెండు చిత్రాలు (RRR - కేజీఎఫ్ 2 లను ఉద్దేశిస్తూ) ట్రెండ్ ను ఎలా నిర్దేశిస్తాయి?' అని అభిషేక్ ప్రశ్నించారు.

'మన దగ్గర సినీ ప్రియులు ఎక్కవ. సినిమాకు భాషతో పనిలేదు.. ఏ భాషలో వచ్చిన అంతిమంగా అది సినిమానే. వివిధ భాషల్లో పనిచేసినా, మనమందరం భారత చిత్ర పరిశ్రమలో భాగమే. మనమందరం ఓ పెద్ద కుటుంబానికి చెందినవాళ్లమే' అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై ఎవరెవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

హిందీ భాష వివాదం ఎక్కడికి వెళ్తుందనేది పక్కన పెడితే.. కరోనా పాండమిక్ తర్వాత సౌత్ సినిమాలే ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ జీవితాలకు భరోసా కల్పించాయనేది వాస్తవం. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎగ్జిబిటర్ మనోజ్ దేశాయ్ అంగీకరించారు. సౌత్ సినిమాల వల్లే బిజినెస్ ట్రాక్ లోకి వచ్చిందని.. అవి లేకపోతే తామంతా రోడ్డున పడేవాళ్ళమని అన్నారు.

''సౌత్ సినిమాలు అద్భుతమైన వ్యాపారం చేసి కరోనా మహమ్మారి తర్వాత ఎగ్జిబిటర్లు తిరిగి పుంజుకోవడానికి చాలా సహాయపడ్డాయి. దీంతో మా వ్యాపారం మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. కరోనాతో సినిమాలు లేక, ఇక్కడ ఉన్న సినిమాలు విజయం సాధించక రోడ్డునపడ్డ మాకు సహాయం చేసిన KGF 2 - RRR - పుష్ప సినిమాలకి మా కృతజ్ఞతలు. దక్షిణాది సినిమాల మాదిరిగా ఆడే హిందీ సినిమాలు మాకు కావాలి. సౌత్ సినిమాలు లేకపోతే మేమంతా రోడ్డున పడేవాళ్ళం'' అని బాలీవుడ్ ఎగ్జిబిటర్ చెప్పుకొచ్చారు.