Begin typing your search above and press return to search.

మహేష్-కేటీఆర్ షో.. క్రెడిట్ ఆమెదా?

By:  Tupaki Desk   |   29 April 2018 7:19 AM GMT
మహేష్-కేటీఆర్ షో.. క్రెడిట్ ఆమెదా?
X
‘భరత్ అనే నేను’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో కీలక ఘట్టం.. మహేష్ బాబు-కొరటాల శివ కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ తో చేసిన స్పెషల్ షో. ఆ చర్చా కార్యక్రమం జనాల్లో చాలా ఆసక్తి రేకెత్తించింది. ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తీసి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతతో కలిసి ఇలా ప్రమోషనల్ ఈవెంట్ చేయడం.. అది చాలా సీరియస్ గా.. ఆసక్తికరంగా సాగడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇదొక సిన్సియర్ మూవీ అనే సంకేతాలు జనాల్లోకి వెళ్లేలా చేసింది ఈ ఈవెంట్. మహేష్-కేటీఆర్ కలిసి ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. ఈ వినూత్న ప్రయత్నం వెనుక మాస్టర్ మైండ్ మహేష్ సతీమణి నమ్రతే అంటున్నారు. ఆమె సూచన మేరకే ఇటు మహేష్.. అటు కేటీఆర్ ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట. ఇది ఇద్దరికీ ఉభయతారకంగా పని చేసింది. ఈ ఈవెంట్ ఇటు చిత్ర ప్రమోషన్లకు ఉపయోగపడగా.. అటు కేటీఆర్ ఇమేజ్ పెరగడానికి కూడా దోహదం చేసింది.

ఈ ఈవెంట్ మాత్రమే కాదు.. ‘భరత్ అనే నేను’ ప్రమోషన్లకు సంబంధించిన క్రెడిట్ చాలా వరకు నమ్రతకు దక్కుతుందట. కొన్నేళ్లుగా మహేష్ సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకుంటోంది నమ్రత. ఆ సినిమాలకు మాత్రమే ఆమె ప్రచార బాధ్యతలు చూసుకుంటూ వచ్చింది. ఐతే ‘భరత్ అనే నేను’ ప్రొడక్షన్లో మహేష్ బాబు బేనర్ భాగస్వామ్యం ఏమీ లేదు. అయినప్పటికీ మహేష్ బాబు కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం కావడంతో ప్రచార బాధ్యతల్ని నమ్రతే చూసుకుందట. సోషల్ మీడియాలో మహేష్ బాబు బాగా వెనుకబడిపోతుండటం.. అతడి సినిమాలపై నెగెటివ్ క్యాంపైన్ గట్టిగా జరుగుతుండటంతో దీన్ని నివారించడానికి ఒక స్పెషల్ పీఆర్ టీం ఏర్పాటు చేయడం.. అలాగే విభిన్నమైన ప్రచారం చేసేందుకు ఒక పబ్లిసిటీ టీంను సెట్ చేయడం.. ఎప్పటికప్పుడు విభిన్న ప్రచార కార్యక్రమాలతో సినిమాకు మంచి బజ్ వచ్చేలా చూడటంలో కూడా నమ్రత పాత్ర కీలకమని అంటున్నారు. మహేష్ ఇటీవల నమ్రతకు ముద్దిస్తూ ఒక ఎమోషనల్ ఫొటో షేర్ చేసుకోవడానికి ఇదే కారణమని సమాచారం.