Begin typing your search above and press return to search.

`రఘుపతి వెంకయ్య నాయుడు ఫిలింన‌గర్`గా మార్చాలి!

By:  Tupaki Desk   |   5 Nov 2021 8:00 AM IST
`రఘుపతి వెంకయ్య నాయుడు ఫిలింన‌గర్`గా మార్చాలి!
X
తెలుగు సినీ పరిశ్రమకు కేంద్రమయిన ఫిలింనగర్ పేరును`రఘుపతి వెంకయ్య నాయుడు ఫిలింనగర్` అని మార్చాలని పలువురు సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు...! నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యాన ఇటీవ‌ల ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన రఘుపతి వెంకయ్య నాయుడు 153 వ జయంతి సభలో ఈ అంశం చర్చకు వచ్చింది...! నేస్తం ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు జె.వి. మోహన్ గౌడ్ - బాబ్జీ ( దర్శకులు )ల సారధ్యంలో జరిగిన ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరయిన దాస‌రి శిష్యుడు సీనియ‌ర్ దర్శకులు రేలంగి నరసింహా రావు మాట్లాడుతూ -``రఘుపతి వెంకయ్య నాయుడు గారు పూనుకొని వుండకపోతే ఇంకో పాతికేళ్ళ తరువాత తెలుగు సినిమా పురుడుపోసుకొనేదేమో అనే సందేహం నాకు కలుగుతుందని..

ఆయన చేసిన త్యాగానికి కృతజ్ఞతగా సినిమా థియేటర్ లలో ప్రతి ప్రదర్శనకు ముందు ఆయన ఫొటోను ప్రదర్శించేలా సినీ పెద్దలు కృషి చేయాల``ని కోరారు. మరో ముఖ్య అతిధి సీనియర్ దర్శకులు పి . సాంబశివరావు మాట్లాడుతూ యీ మహానుభావుడి జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాన్ని మొత్తం సినీ పరిశ్రమ కలిసి ఒక పండగ లాగా
జరిపితే బాగుంటుందని అది ఆయనకు నిజమైన నివాళి కృతజ్ఞత అవుతుంద``ని పేర్కొనారు.

నటుడు రచయిత రావిపల్లి రాంబాబు మాట్లాడుతూ -`` సినీ పరిశ్రమను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరు తింటున్న అన్నం మెతుకులపై రఘపతి వెంకయ్య నాయుడు గారి పేరు వుంటుంద``ని అన్నారు. సభలో ప్రముఖ నిర్మాత బాలాజీ నాగ లింగం ..ఈ టీవి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ .. నేస్తం ఫౌండేషన్ నిర్వాహకుడు.. నిర్మాత మిత్తాన ఈశ్వర్ తదితరులు ప్రసంగించారు.....

ఈ సంధర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహం ఏర్పాటుకోసం స్వర్గీయ కె .బి. తిలక్ గారితో పాటు కృషి చేసిన దర్శకులు లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ .. సీనియర్ దర్శకులు రేలంగి నరసింహా రావు, .. పి . సాంబశివ రావు ల‌ను నేస్తం ఫౌండేషన్ తరుపున జె .వి.మోహన్ గౌడ్- బాబ్జీ లు ఘనంగా సత్కరించి గౌరవ పురస్కారాలను అందజేశారు.