Begin typing your search above and press return to search.

అల్లుడి కోసం ఆ ఇద్దరు

By:  Tupaki Desk   |   5 Sep 2018 6:15 AM GMT
అల్లుడి కోసం ఆ ఇద్దరు
X
ఈపాటికే ‘శైలజా రెడ్డి అల్లుడు’ జాతకం తెలిసిపోవాల్సింది. కానీ ఆగస్టు 31న రావాల్సిన ఆ చిత్రం అనివార్య కారణాలతో వాయిదా పడిపోయింది. అనేక తర్జన భర్జనల తర్వాత ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రిలీజ్ వారంలో గట్టిగా ప్రమోషన్లు చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబరు 9న పెద్ద ఎత్తున ప్రి రిలీజ్ ఈవెంట్ చేయాలని నిర్ణయించారు. ఆ వేడుకకు ఒకరికి ఇద్దరు ప్రముఖ కథానాయకులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. ‘దేవదాస్’ సినిమాలో కథానాయకులుగా నటిస్తున్న అక్కినేని నాగార్జున.. నాని.

చైతూ సినిమాకు నాగార్జున అతిథిగా రావడం కొత్తేమీ కాదు. ఐతే నాగార్జునతో కలిసి సినిమా చేస్తుండటం.. మారుతితో మంచి స్నేహం ఉండటం.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ నిర్మాణ సంస్థలోనూ ఓ సినిమా చేస్తుండటంతో నాని సైతం ఈ ఈవెంట్‌ కు వస్తున్నాడు. మంచి మాటకారులైన నాగ్-నాని వచ్చి ‘అల్లుడు’ గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే కచ్చితంగా అది సినిమాకు ఉపయోగపడుతుంది. ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ బేనర్లోనే చైతూ ‘ప్రేమమ్’ లాంటి హిట్ మూవీ చేశాడు. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయెల్ చైతూకు జోడీగా నటించగా.. రమ్యకృష్ణ అత్తగా కీలక పాత్రలో నటించింది. ఇటీవలే విడుదలైన దీని ట్రైలర్ హిలేరియస్ గా ఉండి సినిమాపై అంచనాలు పెంచింది. గోపీసుందర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నిజార్ షఫి ఛాయాగ్రహణం అందించాడు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.