Begin typing your search above and press return to search.

జనసేన అధినేతకి తలనొప్పిగా మారుతున్న నాగబాబు...?

By:  Tupaki Desk   |   31 May 2020 8:00 PM IST
జనసేన అధినేతకి తలనొప్పిగా మారుతున్న నాగబాబు...?
X
మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ నాయకుడిగా తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అన్ని విషయాలలో కీలకంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన 'ప్రజారాజ్యం' పార్టీలో కూడా కీలకంగా వ్యవహరించిన నాగబాబు పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత కొన్ని రోజులు రాజకీయాలకు దూరమై.. సినిమాలు సీరియల్స్ కామెడీ షోలతో బిజీ అయ్యాడు. అయితే తమ్ముడు పవన్ 'జనసేన' పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో జాయిన్ అయి పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికలలో నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనానికి తట్టుకోలేక అందరి లాగే ఓటమి పాలయ్యారు. అయితే ఒకవైపు యాక్టర్ గా కొనసాగుతూనే కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ అప్పుడప్పుడు రాజకీయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. 'నా ఛానల్ నా ఇష్టం' అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి రాజకీయ సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తున్నాడు. సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ పెడుతూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నాడు. అయితే ఇప్పుడు నాగబాబు వ్యవహారశైలి 'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ కి తలనొప్పిగా మారిందంట.

ఇటీవల మహాత్మా గాంధీని చంపిన నాథురాం గాడ్సే గొప్ప దేశ భక్తుడని ట్వీట్ చేసి నెటిజన్ల విమర్శలకు బలైన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ వివాదం పెద్దది కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగివచ్చి ''నాగబాబు వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయాలు.. పార్టీకి సంబంధం లేదు'' అంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ మధ్య బాలయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వీడియో రిలీజ్ చేసి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తప్పొప్పులు ఎవరివి అనేది పక్కన పెడితే ఈ వివాదం వలన జనసేన పార్టీకి కూడా ఎఫెక్ట్ పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి దాకా జనసేనకు సపోర్ట్ గా ఉన్న కొందరు నందమూరి అభిమానులు కూడా ఈ ఇన్సిడెంట్ వలన దూరమయ్యేరు అనేది కొంతమంది జనసేన కార్యకర్తల అభిప్రాయం.

దీనికి తోడు నిన్న తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు. ఒక్కటి మాత్రం నిజం తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని.. అయితే టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదనేది తన నమ్మకమని.. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీలో ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు. డెవలప్మెంట్ అంతా అనుకుల టీవీల్లోను, పత్రికల్లోనే కనబడేది తప్ప నిజంగా చేసింది తక్కువ.. దానికి తోడు కరెప్షన్ ఇసుక మాఫియా కాల్ మనీ అంటూ ఇంకా చాలా వున్నాయి. అందుకే ఎలక్షన్స్ లో ఘోరంగా ఓడిపోయింది అన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తించాలి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇప్పుడు ఇది కూడా పవన్ కళ్యాణ్ ని మరింతగా ఇబ్బంది పెడుతోందట. అధికార వైసీపీని వదిలేసి టీడీపీని కామెంట్ చేయడం వలన లేని సమస్య వచ్చేలా ఉందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

2014 ఎన్నికలలో టీడీపీకి సపోర్ట్ ఇచ్చిన జనసేన నాలుగేళ్ళ ప్రయాణం తర్వాత బయటకి వచ్చి 2019లో కమ్యూనిస్టులు మరియు బీఎస్పీతో కలిసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీకి మద్ధతు ప్రకటించింది. రాజకీయాల్లో శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరంటారు. అదే విధంగా రేపు ఫ్యూచర్ లో టీడీపీ మళ్ళీ బీజేపీతో దోస్తీ కడితే జనసేన కూడా టీడీపీ కి సపోర్ట్ చేయాల్సి వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో నాగబాబు తన పర్సనల్ అంటూ టీడీపీ పై విమర్శలు చేసినా.. అది జనసేనతో టచ్ లో ఉన్న టీడీపీ నాయకులను దూరం చూసే అవకాశం ఉందని.. ఇది రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని జనసేన అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద నాగబాబు తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి లేని సమస్యలు సృష్టిస్తున్నాడని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.