Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య..? హీరోయిన్ గా లక్కీ బ్యూటీ..?

By:  Tupaki Desk   |   8 Aug 2022 3:30 PM GMT
గీతా ఆర్ట్స్ లో నాగచైతన్య..? హీరోయిన్ గా లక్కీ బ్యూటీ..?
X
అక్కినేని నాగచైతన్య నాలుగు బ్యాక్ టూ బ్యాక్ విజయాల తర్వాత ఇటీవల 'థాంక్యూ' చిత్రంతో పరాజయం అందుకున్నారు. ఇది చైతూ కెరీర్ లోనే అతి పెద్ద ప్లాప్ గా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో ఈసారి సాలిడ్ సక్సెస్ తో కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన యువసామ్రాట్.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు.

చైతన్య ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ తెలుగు తమిళ ద్విభాషా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు చై. దీని తర్వాత పరశురాం పెట్లా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు.

నిజానికి చైతూ - పరశురాం కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సింది. 14 రీల్స్ ప్లస్ లో ఈ ప్రాజెక్ట్ ను లాంచ్ చేశారు. అయితే మహేష్ బాబు తో మూవీ చేసే అవకాశం రావడంతో దర్శకుడి ప్రాధాన్యత మారింది. 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత నాగచైతన్య తో సినిమా చేయబోతున్నట్లు పరశురామ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.

'థాంక్యు' ప్రమోషన్స్ లో చైతూ ఈ ప్రాజెక్ట్ మీద క్లారిటీ ఇచ్చారు. ఈమధ్యే పరశురాం కలిశాడని.. కథ గురించి మాట్లాడుకున్నామని తెలిపారు. కాకపోతే ఇంకా తనకు ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేయలేదని.. కథ సిద్ధమయ్యాక ఆ సినిమా ఎప్పుడనేది చెబుతామని అన్నారు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం డైరక్టర్ పరశురాం ఇటీవలే చైతన్య కు ఫుల్ నేరేషన్ ఇచ్చారట. దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. ఇది లవ్ అండ్ యాక్షన్ జోనర్ మూవీ అని టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

'శ్రీరస్తూ శుభమస్తు' 'గీత గోవిందం' తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థలోనే పరశురాం మరో మూవీ చేయాల్సి ఉంది. అలానే '100% లవ్' తర్వాత చైతన్య అదే బ్యానర్ లో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఇప్పుడు దర్శక హీరోలిద్దరూ కలిసి అల్లు అరవింద్ నిర్మాణంలో సినిమా చేస్తారని అనుకుంటున్నారు.

అంతేకాదు పరశురాం సినిమాలో నాగచైతన్య కు జోడీగా రష్మిక మందన్నా ని హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్ తో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రష్మిక.. ఇంతకుముందు పరశురాం డైరెక్ట్ చేసిన 'గీత గోవిందం' చిత్రంలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చైతూ కోసం లక్కీ బ్యూటీనే తీసుకునే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.

నాగచైతన్య - పరశురాం ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెల్లడానికి కాస్త టైం పట్టేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లోపు వెంకట్ ప్రభు సినిమాని రిలీజ్ చేయాలని అక్కినేని హీరో ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాతే పరశురాం మూవీ ఉంటుంది. ఇందులో హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని వార్తలు వచ్చాయి కానీ.. అవన్నీ నిజం కాదని చై క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ 'లాల్ సింగ్ చడ్డా' రిలీజ్ కు రెడీ అయింది. అమీర్ ఖాన్ తో కలిసి చేసిన ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక 'దూత' అనే వెబ్ సిరీస్ తో చైతూ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది.