Begin typing your search above and press return to search.

ఆ సంస్థలో చేస్తే కెరీర్ బెస్ట్ హిట్టేనా!

By:  Tupaki Desk   |   31 March 2018 6:47 AM GMT
ఆ సంస్థలో చేస్తే కెరీర్ బెస్ట్ హిట్టేనా!
X
తెలుగులో వరుసగా భారీ సినిమాలు నిర్మిస్తూ నిలకడగా విజయాలు సాధించే పెద్ద సంస్థలు అరుదైపోయాయి. ఒకప్పటి పెద్ద సంస్థలన్నీ బాగా జోరు తగ్గించేశాయి. కొన్ని సంస్థలు తెరమరుగైపోయాయి. గత కొన్నేళ్లలో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి నిలకడగా విజయాలు సాధిస్తున్న సంస్థల్లో యువి క్రియేషన్స్ ఒకటి. దాని తర్వాత ఇప్పుడు ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఘనంగా తన ప్రస్థానాన్ని సాగిస్తోంది. ఈ సంస్థ ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘జనతా గ్యారేజ్’ రూపంలో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి వచ్చిన ‘రంగస్థలం’ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ చిత్రం కూడా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

‘శ్రీమంతుడు’ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా.. ‘జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కు అతి పెద్ద విజయంగా నిలిచింది. ఇప్పుడు ‘రంగస్థలం’ రామ్ చరణ్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని అంచనా వేస్తున్నాడు ట్రేడ్ పండిట్లు. చరణ్ కెరీర్లో ‘మగధీర’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పదేళ్ల కిందటే ఈ చిత్రం రూ.80 కోట్ల దాకా షేర్ రాబట్టింది. దాన్ని ఆ తర్వాత ఏ చరణ్ సినిమా అధిగమించలేకపోయింది. దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. ఐతే ‘ధృవ’ లాంటి హిట్ తర్వాత చేసిన సినిమా కావడం.. అందులోనూ చరణ్ సుకుమార్ లాంటి పెద్ద దర్శకుడితో జత కట్టడం.. ప్రమోషన్లు కూడా గట్టిగా చేయడంతో ‘రంగస్థలం’కు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రావాలంటే రూ.80 కోట్ల షేర్ రాబట్టాలి. అలా చేయగలిగితే ‘మగధీర’ రికార్డు కూడా బద్దలవుతుంది. ప్రస్తుతం ట్రేడ్ ట్రెండ్స్ చూస్తుంటే అది అసాధ్యమేమీ కాదని అనిపిస్తోంది. అదే జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ మరో హీరోకు హైయెస్ట్ గ్రాసర్ అందించబోతున్నట్లే.